స్కూల్ టీచర్, ఆమె తనయుడి హత్య.. భర్త, ట్యూటర్లను విచారిస్తున్న పోలీసులు
కోల్కతాలో ఓ స్కూల్ టీచర్, ఆమె కొడుకు ఇద్దరూ రక్తపుమడుగులో విగత జీవులై కనిపించారు. కొందరు దుండగులు కిచెన్లోని కత్తులతో వారిపై దాడి చేసి హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె భర్త, వారి కుమారుడికి ట్యూషన్ చెప్పే ట్యూటర్ను విచారిస్తున్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం జరిగింది. ఓ స్కూల్ టీచర్ను 14ఏళ్ల ఆమె కొడుకునూ కొందరు పట్టపగలే హత్య చేశారు. ఆమె మృతదేహం ఫ్లోర్పై రక్తపుమడుగులో పడి ఉండగా, బెడ్పై నెత్తురోడుతూ ఆమె తనయుడి డెడ్ బాడీ కనిపించింది. బాలుడు వేసుకున్న స్కూల్ యూనిఫామ్, మెడకు కట్టుకున్న టై కూడా అలాగే ఉంది. కిచెన్లోని కత్తులతో వారిరువురిని పొడిచి చంపినట్టు అనుమానిస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఈ హత్యలో పాలుపంచుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
వారి పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రావల్సి ఉన్నది. స్కూట్ టీచర్ భర్త, ఆ బాలుడికి ట్యూషన్ చెప్పే ట్యూటర్ను పోలీసులు విచారిస్తున్నారు. ట్యూటర్ ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు వచ్చారని చెప్పారు. అయితే, అప్పటికే డోర్ మూసి ఉండటం, లైట్స్ ఆఫ్ చేసి ఉండటంతో వెనుదిరిగినట్టు వివరించారు.
ఇరుగురుపొరుగు మాత్రం తమకు అసలు ఎలాంటి శబ్దాలు వినిపించలేదని, అనుమానాస్పదంగా ఏవీ కనిపించలేవని తెలిపారు. నిందితులు మృతి చెందిన స్కూట్ టీచర్కు తెలిసినవారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందువల్లే ఆమె వారి కోసం డోర్ తీసి ఉండొచ్చని చెప్పారు. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్నవారందరి కాల్ రికార్డ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.