ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో  ఇవాళ  రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.  కారు, స్కూల్ బస్సు ఢీకొనడంతో  ఈ ఘటన చోటు  చేసుకుంది. 

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.స్కూల్ బస్సు ఎస్‌యూవీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేపై రాహుల్ విహార్ సమీపంలో ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న మృతదేహలను వెలికితీయడానికి పోలీసులు కష్టపడ్డారు. కారు డోర్లను కట్ చేసి మృతదేహలను వెలికి తీశారు

.ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్కూల్ బస్సు డ్రైవర్ ఢిల్లీలోని ఘాజీపూర్ నుండి రాంగ్ రూట్ లో బస్సును తీసుకువస్తున్నాడని పోలీసులు చెప్పారు.కారు మీరట్ నుండి గురుగ్రామ్ వరకు వెళ్తుంది. రాంగ్ రూట్ లో బస్సు రావడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టినట్టుగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామానంద్ కుష్వా పేర్కొన్నారు.

సోమవారంనాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘడ్ లోని లీలాపూర్ లో టెంపో పై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.లక్నో- వారణాసి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రానికి 15 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలను ఎక్స్ గ్రేషియాను యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు.