ఉత్తరప్రదేశ్లోని బుదౌన్లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సమాజ్ వాదీ నాయకుడితో పాటు అతని కుటుంబంలోని మరో ఇద్దరిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.
ఉత్తరప్రదేశ్లోని బుదౌన్లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సమాజ్ వాదీ నాయకుడితో పాటు అతని కుటుంబంలోని మరో ఇద్దరిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఆయన ఇంట్లోకి దూరి ఈ దారుణానికి ఒడిగట్టారు. వివరాలు.. స్థానిక సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు రాకేష్ గుప్తా (55), అతని భార్య (51), అతని తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంట్లో కాల్చి చంపారు. రెండు బైక్లపై వచ్చిన నలుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సాయంత్రం 6 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు రాకేష్ గుప్తా ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయితే వారి చేతుల్లో ఆయుధాలు ఉండటంతో అక్కడివారు వారిని ఆపేందుకు సాహసం చేయలేకపోయినట్టుగా తెలుస్తోంది.
రాకేష్ గుప్తా గతంలో బ్లాక్ చీఫ్గా ఉన్నారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫోరెన్సిక్ నిపుణులతో ఎస్ఎస్పీ ఓపీ సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో రాకేష్ గుప్తా కుమార్తె మార్కెట్కు వెళ్లిందని.. దీంతో ఆమె ఈ ప్రమాదం నుంచి తప్పించుకుందని పోలీసులు చెప్పారు.
దుండగులు ఇంటి ప్రధాన ద్వారం గుండా లోనికి ప్రవేశించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. రాకేష్ సోదరుడు రాజేష్ మాట్లాడుతూ.. చాలా కాలంగా నెలకొన్న రాజకీయ శత్రుత్వం కారణంగా తమ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు చాలా మంది గ్రామం నుంచి పట్టణానికి నివాసాన్ని మార్చుకున్నారని చెప్పారు. రాకేష్ గుప్తా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టారు.
