జనాభా నియంత్రణపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే..?
బలవంతపు జనాభా నియంత్రణ చాలా ప్రమాదకరమైన పరిణామాలను దారి తీస్తుందనీ, ఇది లింగ అసమతుల్యతను సృష్టిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
బలవంతపు జనాభా నియంత్రణ ప్రమాదకరమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం అన్నారు. ఆదివారం గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన.. తన పుస్తకం 'ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ ఏ అన్సర్టైన్ వరల్డ్' గుజరాతీ అనువాదాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ జనాభా పెరుగుదల గురించి చర్చించారు. భారత జనాభా పెరుగుదల రేటు పడిపోతోందనీ, సామాజిక అవగాహనతో కాలక్రమేణా ప్రతి ఒక్కరిలో కుటుంబ పరిమాణం తగ్గిస్తున్నారని తెలిపారు.
కఠినపూరిత జనాభా నియంత్రణ చాలా ప్రమాదకరమని, లింగ అసమతుల్యతను సృష్టించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి.. భారతదేశం దాని జనాభా నిర్మాణంలో భారీ మార్పును చూసిందనీ, ఇది జనాభా విస్ఫోటనానికి దారి తీసుందనీ, ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుందని అన్నారు. ప్రజలు విద్యావంతులు కావడం, సామాజిక అవగాహన తదితర కారణాలతో భారత జనాభా వృద్ధి రేటు వేగంగా తగ్గుతోందని జైశంకర్ తెలిపారు.
కాలక్రమేణా కుటుంబ పరిమాణం తగ్గుతోందనీ, బలవంతంగా జనాభా నియంత్రణ చేపట్టడం వల్ల ప్రమాదకర పరిణామాలు తలెత్తుత్తాయని, జనాభా నియంత్రణ వల్ల.. కొన్ని దేశాల్లో లింగ అసమానతలు పెరుగుతున్నాయని, ఇలాంటి చర్యలు ఏ సమాజానికైనా అది ప్రయోజనకరం కాదని అన్నారు. అలాగే.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం పట్ల కొన్నిసార్లు ప్రజలు విసుగు చెందినా.. అప్రజాస్వామికం కంటే ప్రజాస్వామ్యమే మెరగైందని అన్నారు. జనాభా నియంత్రణ వంటి..సమస్యలు ప్రజాస్వామ్యయుతంగా పరిష్కారించాలని, బలవంతంగా కుటుంబ నియంత్రణ చేపట్టిన వారు విచారిస్తున్నారని జైశంకర్ అన్నారు.
ఇదిలా ఉంటే.. 2023 నాటికి జనాభా పరంగా చైనాను భారత్ అధిగమించనున్నది. UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ (WPP) 2022 అంచనాల ప్రకారం.. 2023 నాటికి 140 మిలియన్ల జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమించనున్నది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ జనాభాలో 17.5 శాతంగా ఉండగా.. భారతదేశ జనాభా 2030 నాటికి 150 కోట్లకు, 2050 నాటికి 166 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.
స్వతంత్ర విదేశాంగ విధానంపై జైశంకర్ ఏమన్నారు?
భారత విదేశాంగ విధానంపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు విదేశాంగ విధానంపై ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయని అన్నారు. అందుకు ఇజ్రాయెల్ పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమని అన్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇజ్రాయెల్తో సంబంధాలను పెంచుకోకుండా మనల్ని మనం పరిమితం చేసుకోవాల్సి వచ్చిందని, ఇజ్రాయెల్లో పర్యటించిన తొలి భారత ప్రధాని ప్రధాని మోదీ అని, ఓటు బ్యాంకు రాజకీయాలకు జాతీయ ప్రయోజనాలను పెట్టాల్సిన కాలం పోయిందని జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు.