Asianet News TeluguAsianet News Telugu

కరోనా సెకండ్ వేవ్ : దేశంలో 24 గంటల్లో 4.01 లక్షల కొత్త కేసులు.. ఢిల్లీలో 4,187 మరణాలు..

దేశంలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజే 4,000 మందికి పైగా కోవిడ్ మరణాలు సంభవించాయి. అంతేకాదు వారంలో నాల్గవసారి 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నివారణకుకఠిన చర్యలు తీసుకుంటే  కోవిడ్ థార్డ్ వేవ్ నుండి తప్పించుకోవచ్చని నిన్న ప్రభుత్వం తెలిపింది.

Record 4,187 Covid Deaths In India In 24 hours, 4.01 Lakh New Cases - bsb
Author
Hyderabad, First Published May 8, 2021, 10:36 AM IST

దేశంలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజే 4,000 మందికి పైగా కోవిడ్ మరణాలు సంభవించాయి. అంతేకాదు వారంలో నాల్గవసారి 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నివారణకుకఠిన చర్యలు తీసుకుంటే  కోవిడ్ థార్డ్ వేవ్ నుండి తప్పించుకోవచ్చని నిన్న ప్రభుత్వం తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ పెరుగుదలను నివేదించిన ఒక రోజు తర్వాత, దేశంలో ఈ రోజు మళ్లీ 4.01 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 37,23,446 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,187 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2.38 లక్షలకు చేరుకున్నాయి.

గత కొన్ని రోజులుగా చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి లాక్డౌన్లు, కర్ఫ్యూలు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో తమిళనాడు, కర్ణాటక, మణిపూర్‌లు చేరాయి. కర్ణాటకలో సోమవారం నుండి మే 24 వరకు రెండు వారాల లాక్డౌన్ ప్రకటించబడింది. తమిళనాడు కూడా రెండు వారాల కర్ఫ్యూ ప్రకటించింది. మణిపూర్‌లో మే 17 వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు.

ఈ జనవరిలో రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఆ తరువా మార్చి మొదటివారం వరకు దేశవ్యాప్తంగా ఒక్క రోజులో కేవలం 20వేలకంటే తక్కువ కేసులే నమోదవుతూ వచ్చాయి. అయితే, ఏప్రిల్‌లో హెల్త్ కేర్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం కరోనా సెకండ్ వేవ్ వల్ల దాదాపు 66 లక్షల కేసులు నమోదయ్యాయి.

కఠిన చర్యలు అమలు చేస్తే దేశంలో కరోనా థార్డ్ వేవ్ ను రాకుండా చూడొచ్చని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. థార్డ్ వేవ్ అనివార్యమని కేంద్రం చెప్పిన కొద్ది గంటలకే ఇది జరిగింది.

ప్రతిరోజూ ఢిల్లీకి 700 టన్నుల మెడికల్ ఆక్సిజన్ అందించాల్సి ఉందని సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పిన కొన్ని గంటల తరువాత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ రాజధానిలో ఆక్సిజన్ కొరత పరిష్కారమైందని అన్నారు. ఆసుపత్రులు, రోగుల కుటుంబాలు, స్నేహితుల నుండి వచ్చిన మెసేజ్ లు గత రెండు వారాలుగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

థార్డ్ వేవ్ వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే శుక్రవారం అన్నారు. దేశంలో అత్యధిక మొత్తంలో కరోనా కేసులు నమోదైన రాష్ట్రమైన మహారాష్ట్ర.. ఇప్పుడు పిల్లల కోసం కోవిడ్ కేంద్రాలను సిద్ధం చేయడం ప్రారంభించింది. కాగా భారతదేశంలో పిల్లలకు టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు.

కర్ణాటకలోని కోవిడ్ పేషంట్ల కోసం కేంద్రం ఇప్పుడిస్తున్న ఆక్సీజన్ సరఫరాను మరింత పెంచాలని హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన కేంద్రానికి చుక్కెదురయ్యింది.  కేంద్రం అప్పీలును కొట్టివేస్తూ  "మేము కర్ణాటక ప్రజలను ఇబ్బంది పెట్టలేం" అని తెలిపింది. సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి దేశం చేస్తున్న పోరాటంలో వనరుల కొరత మీద అన్ని కోర్టుల్లోనూ మారథాన్ హియరింగ్స్ జరుగుతున్నాయి.

భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి చాలా దేశాలు ముందుకు వచ్చాయి. మూడు 18-టన్నుల ఆక్సిజన్ జనరేటర్లు, 1,000 వెంటిలేటర్లతో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానం శుక్రవారం ఉత్తర ఐర్లాండ్ నుండి దేశానికి బయలుదేరింది, భారత్ లో COVID-19 సంక్షోభానికి UK  తాజాగా ఈ సాయంతో ప్రతిస్పందించింది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు ఉచితంగా అందించాలని మమతా బెనర్జీ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వ్యాక్సిన్లకు నిర్ణయించిన ధర  వివాదాస్పదంగా ఉంది. "వ్యాక్సిన్ ధరలపై రాష్ట్రాలు వేరువేరుగా చర్చలు, బేరసారాలు చేయలేవు. వ్యాక్సిన్ల కోసం నిధులను కేటాయించమని రాష్ట్రాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇప్పటికే ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలపై విపరీత ప్రభావాన్ని చూపుతుంది" అని రాష్ట్రం తెలిపింది.

భారత్ జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది, అయితే అనేక రాష్ట్రాలు టీకా కొరత తో ఎర్రజెండా చూపించిన తరువాత టీకాల వేగం తగ్గింది. నిన్న, దాదాపు 23 లక్షల టీకాలు వేశారు. ఇప్పటివరకు మొత్తం 16.7 కోట్ల మోతాదులను వివిధ రాష్ట్రాలకు ఇచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios