అయోధ్య ఆలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఇదే...
అయోధ్య ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ రామయ్య దివ్య రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు.
![Ram Lalla statue in Ayodhya Temple AKP Ram Lalla statue in Ayodhya Temple AKP](https://static-ai.asianetnews.com/images/01hmfqaws44e9x48sq8y34ksrc/ram-lalla-idol1-1705629807396_363x203xt.jpg)
అయోధ్య : శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపద, చూడగానే ఆకట్టుకునే హంగులతో అయోధ్య ఆలయ నిర్మాణం జరిగింది. అంతేకాదు ఆలయాన్ని ప్రారంభించేందుకు ఖరారు చేసిన ముహూర్తానికి సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలా అయోధ్య ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్న బాలరాముడి విగ్రహం ఇప్పటికే గర్భగుడిలోకి చేరింది. ఆ సుందరమూర్తికి చెందిన ఫోటోలు బయటకు వచ్చాయి.
మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని వేదమంత్రాలు, ప్రత్యేక పూజల మధ్య అయోధ్య ఆలయానికి చేర్చారు. 51 అంగుళాల పొడవు, 1.5 టన్నుల బరువుతో నల్లని రూపంలో అయోధ్య రామయ్య విగ్రహం వుంది. కమలంపై నిల్చున్న బాలరాముడి ఫోటోను చూసే భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు.
అయోధ్య రామయ్య ముుఖం కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పారు. గర్భగుడిలో కొలువైన ఈ విగ్రహానికి జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకపూజలు చేసి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇలా రామయ్య నిజరూపమే ఇంత అద్భుతంగా వుంటే ఆభరణాలు, విల్లు ధరించాక చూస్తే ఇంకెంత అందంగా వుంటుందోనని భక్తులు అంటున్నారు.
Also Read Ayodhya Ram Mandir : అయోధ్యలో వెజ్ ఓన్లీ 7 స్టార్ హోటల్.. భారతదేశంలోనే మొట్టమొదటిది
నిన్న(గురువారం) అయోధ్య గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేదమత్రోచ్చరణల మధ్య జరిగింది. దాదాపు నాలుగు గంటలపాటు 121 మంది పండితులు ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే జనవరి 22న ప్రాణప్రతిష్ట అనంతరం రామయ్యను అలంకరించి ప్రత్యేక పూజలు ప్రారంభించానున్నారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు ఇలా 7,000 మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని ఆలయ ట్రస్ట్ తెలిపింది. జనవరి 23 నుండి అయోధ్య రామయ్య భక్తులందరికి దర్శనమివ్వనున్నారు.