పాకిస్తాన్‌లోని లవర్ కోసం రాజస్తాన్‌కు చెందిన వివాహిత సరిహద్దు దాటేసింది. జైపూర్‌కు వెళ్లుతున్నానని చెప్పి పాక్‌లోని ఖైబర్ పక్తుంక్వాకు వెళ్లింది. తాను లాహోర్‌లో ఉన్నానని, మరో మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తానని వాట్సాప్ ద్వారా తన భర్తకు ఆమె చెప్పింది. తన భార్య తిరిగి వస్తుందని భర్త ఆశిస్తున్నాడు.  

న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చిన మహిళ సీమా హైదర్ బ్యాక్‌గ్రౌండ్, ఆమె రావడానికి గల లక్ష్యం గురించి దర్యాప్తు ఇంకా ముగియకముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అయితే.. ఇది రివర్స్. భారత్ నుంచి ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం ఓ మహిళ పాకిస్తాన్‌కు వెళ్లింది. రాజస్తాన్‌లోని బీవడీ నుంచి పాకిస్తాన్‌లో ఖైబర్ పక్తుంక్వాకు పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అర్వింద్, అంజులు భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భీవడిలోని అద్దెకు ఒక ఫ్లాట్‌లో ఈ దంపతులు అంజు సోదరుడితో కలిసి ఉంటున్నారు. అర్వింద్ భీవడిలోనే పని చేస్తున్నారు. అంజు బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నది. అబ్రాడ్‌లో జాబ్ చేయాలని 2020లోనే ఆమె పాస్‌పోర్టు తీసుకుంది.

అంజుకు పాకిస్తాన్‌కు చెందిన నస్రుల్లా ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్షిప్ లవ్‌గా మారింది. 29 ఏళ్ల నస్రుల్లా మెడికల్ ఫీల్డ్‌లో పని చేస్తున్నాడు. తన ఫ్రెండ్ నస్రుల్లా వద్దకు వెళ్లాలని అంజు అనుకున్నది. తాను జైపూర్‌కు వెళ్లుతున్నానని, కొన్నాళ్లు అక్కడే ఉంటానని భర్తకు అంజు చెప్పింది. కానీ, ఆమె ఏకంగా దేశ సరిహద్దు దాటింది.

Also Read: అనూహ్యంగా పెరిగిన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ షేర్లు.. ఐదేళ్లలో 395 శాతం పెరుగుదల

మీడియా ద్వారా ఈ విషయం భర్త అర్వింద్‌కు ఆదివారం తెలిసింది. ఈ విషయంపై అర్వింద్ స్పందించాడు. తన భార్య వాట్సాప్ ద్వారా టచ్‌లో ఉన్నదని వివరించాడు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆమె తనకు ఫోన్ చేసినట్టు చెప్పాడు. తాను లాహోర్‌లో ఉన్నానని, మరో మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్టు ఆయన పేర్కొన్నాడు. పాకిస్తాన్‌లో లవర్ గురించి ప్రస్తావించగా.. తనకు ఆ విషయం తెలిసిందని వివరించాడు. అయితే.. తన భార్య తిరిగి తన వద్దకు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పాడు.

అంజు తొలుత అక్కడ పోలీసు కస్టడీలో ఉన్నది. కానీ, ఆమె ట్రావెల్ డాక్యుమెంట్లు అన్నీ సరిగా ఉండటంతో వారు వదిలిపెట్టారు. అంతేకాదు, ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా.. దేశానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవడానికి సెక్యూరిటీని కూడా ఇచ్చినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.