Punjab Congress: కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడిగా అమ‌రీంద‌ర్ సింగ్ బ్రార్‌ను నియ‌మిస్తూ   ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇక… పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా భ‌ర‌త్ భూష్ ఆసూను ప్ర‌క‌టించింది. సీఎల్పీ నేత‌గా ప్ర‌తాప్ సింగ్ బాజ్వాను నియ‌మిస్తూ కాంగ్రెస్ సంస్థాగ‌త వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

Punjab Congress: ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పాలై.. అధికారం కోల్పోయిన విష‌యం తెలిసిందే. దీంతో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు డీలాపడ్డారు. ఈ క్ర‌మంలో పార్టీలో నూత‌న ఉత్స‌హం, న‌వ శ‌క్తి యుక్తులను అందించాల‌ని అధినేత్రి సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో కీల‌క మార్పులు చేశారు. ఈ క్ర‌మంలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నియమించారు. పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్పీ నేత)గా ప్రతాప్ సింగ్ బజ్వా ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెప్పారు. 

అలాగే..పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భరత్‌ భూషణ్‌ను నియమించినట్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ పేర్కొంది. అంతే కాకుండా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనేత‌గా డాక్టర్ రాజ్ కుమార్ ఛబ్బేవాల్ నియ‌మించారు. ఈ మేరకు సోనియా గాంధీ ఆమోదంలో నియామకాలు జరిగినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో శనివారం రాత్రి ఒక ప్రకటన వెలువడింది.

 ఐదు రాష్ట్రాల ఘోర ఎన్నిక‌ల ప‌రాభ‌వానికి బాధ్యులుగా చేస్తూ ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్య‌క్షులు రాజీనామాలు చేయాల‌ని కాంగ్రెస్ చీఫ్ సోనియా ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడిగా వున్న సిద్దూ ఈ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా ప‌త్రాన్ని సోనియా గాంధీకి పంపారు. రాజీనామాను ఆమోదించిన కొద్ది రోజుల తర్వాత కొత్త చీఫ్ నియమితులు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. జాతీయ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ మళ్లీ యాక్టివ్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల .. క్ర‌మంగా పలు రాష్ట్రాల నేతలతో వరుసగా సమావేశాలు జరుపుతుండటం తెలిసిందే. సెప్టెంబర్ లో జరుగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీనే మళ్లీ పగ్గాలు చేపడతారనే అంచనాల నడుమ తాజా నియామకాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం తెలిసిందే. 92 సీట్ల భారీ మెజార్టీతో ఆప్ అధికారంలోకి రాగా, 18 సీట్లతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 3, బీజేపీ 2, బీఎస్పీ 1, స్థానాలతో సరిపెట్టుకున్నాయి.