యోధులకు నేనున్నాననే భరోసా: ప్రతీ ఏటా దీపావళీ వారితోనే..
దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండగ జరుపుకొన్నారు. ఈ ఉదయం రాజస్థాన్లోని జైసల్మేర్ చేరుకున్న మోడీ.. అక్కడి లోంగేవాలా పోస్ట్లో సరిహద్దు జవాన్లను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండగ జరుపుకొన్నారు. ఈ ఉదయం రాజస్థాన్లోని జైసల్మేర్ చేరుకున్న మోడీ.. అక్కడి లోంగేవాలా పోస్ట్లో సరిహద్దు జవాన్లను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. వారికి మిఠాయిలు పంచారు.
ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాకు మోదీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని హెచ్చరించారు.
దేశాన్ని రక్షించే సైనికులను చూసి యావత్ భారతావని గర్వపడుతోందని ప్రధాని అన్నారు. ఆక్రమణదారులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యం సైనికులను ఉందని చెప్పారు. ఉగ్రవాదులను భారత్ అంతమొందిస్తోందని చెప్పారు.
మన సైన్యం ముందు ఉగ్రవాదుల ఆటలు సాగవని, దేశ భద్రత విషయంలో భారత్ రాజీపడబోదని ప్రపంచం యావత్తు నేడు గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తదితరులు పాల్గొన్నారు.
ఇతరులను అర్ధం చేసుకోవడం మా విధానం.. మా సహనాన్ని పరీక్షించాలని చూస్తే సరైన సమాధానం చెప్తామని పరోక్షంగా పాకిస్థాన్, చైనాలకు హెచ్చరికలు చేశారు. మనలో ధైర్యసాహసాలే ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. రాబోయే తరాలు జవాన్ల త్యాగాలను గుర్తుంచుకుంటాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా 1971 ఇండియా-పాక్ యుద్ధంలో వీరోచిత పోరాటం చేసి అమరుడైన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చంద్పురి స్మారకం వద్ద నివాళలర్పించారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం దెబ్బంటో పాకిస్థాన్ రుచిచూసిందన్నారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దీపావళీకి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది దీపావళి నాడు సరిహద్దులకు తరలి వెళ్తున్నారు.
ప్రతికూల వాతావరణంలోనూ మోడీ వెనుకంజ వేయలేదు. జవాన్లకు తన చేతుల మీదుగా స్వీట్ బాక్స్లను అందజేస్తున్నారు. దేశం మొత్తం వారి వెంట ఉందనే సందేశాన్ని జవాన్లకు ఇవ్వడానికే తాను వారితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొంటున్నానని మోడీ చాలాసార్లు చెప్పారు.
ఎప్పుడూ ఒకేచోటికి వెళ్లకుండా ప్రతి సంవత్సరం వేర్వేరు సరిహద్దు ప్రాంతాలను ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక ప్రదేశాలకు వెళ్లొచ్చారు.
ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి ఏడాదే ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ను సందర్శించారు. 2015లో పంజాబ్ సరిహద్దుల్లో దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. ఆ మరుసటి ఏడాది హిమాచల్ ప్రదేశ్కు వెళ్లి ఐటీబీపీ జవాన్లను కలిశారు.
2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్లో భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లతో దీవాళీ వేడుకలను జరుపుకున్నారు. గతేడాది జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ సెక్టార్ను సందర్శించారు. ఈ సారి పశ్చిమ సరిహద్దుల వైపు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.
2016 లో, భారత-చైనా సరిహద్దులోని హిమాచల్ ప్రదేశ్ సుమ్డో చాంగో వద్ద మోడీ దీపావళీ వేడుకలు జరుపుకున్నారు. 2015లో ప్రధాని మోడీ పంజాబ్లో మూడు స్మారక చిహ్నాలను సందర్శించారు.
1965 యుద్ధంలో భారత సాయుధ దళాల అద్భుతమైన విజయాలను గుర్తుచేస్తుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అసల్ ఉత్తరా ట్యాంకును కూడా ప్రధాని సందర్శించారు. అలాగే హల్వారాలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్ను కూడా సందర్శించారు.
భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆకస్మికంగా లఢఖ్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తూర్పు లఢఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో గాయపడిన వీర జవాన్లను కలిశారు.
లేహ్లోని ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కో సైనికుడి దగ్గరకు వెళ్లి.. మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా నింపే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోడీ. భారత్ ఎప్పుడూ ప్రపంచంలోని ఏ శక్తికీ తలవంచదని, 130 కోట్ల మంది ప్రజల తరఫున మీరు ధైర్య సాహసాలతో శత్రువుకు గుణపాఠం నేర్పారని కీర్తించారు.
యావత్ ప్రపంచానికి భారత వీరత్వాన్ని చాటారని అన్నారు. శత్రువును మీరు ఎదుర్కొన్న తీరు గురించి ప్రపంచమంతా తెలుసుకుంది. ఇప్పుడు ఈ వీరులెవరన్న విషయం తెలుసుకోవాలనుకుంటోంది. మీ శిక్షణ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తోంది. మీ త్యాగాల గురించి, వీరత్వం గురించి ప్రపంచం చర్చించుకుంటోంది అని చెప్పారు మోడీ.