బీజేపీ పార్లమెంటరీ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది.ఈ సమావేశంలో ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ: లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి విజయం సాధించినట్టుగానే విపక్షాలపై గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ ఎంపీలను కోరారు.మంగళవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి ఇండియా కూటమి కాదన్నారు. విపక్ష కూటమిని అహంకార కూటమిగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.అహంకారులను ఐక్యంగా ఎదుర్కొందామని ఆయన కోరారు.
విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకొనేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారని ప్రధాని సెటైర్లు వేశారు. నిన్న రాజ్యసభలో ఢిల్లీ బిల్లును సెమీ ఫైనల్ గా విపక్షాలు భావించాయన్నారు. కానీ నిన్న రాజ్యసభలో ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందడంలో కృషి చేసిన ఎంపీలను ప్రధాని మోడీ అభినందించారు.మోడీ సర్కార్ పై విపక్షాలు అవిశ్వాసాన్ని ప్రతిపాదించాయి. ఈ అవిశ్వాసంపై ఇవాళ్టి నుండి లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ చర్చకు ప్రధాని మోడీ ఈ నెల 10వ తేదీన సమాధానం చెప్పనున్నారు.
