ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పీఎఫ్ఐ ప్లాన్: రిపోర్ట్స్
PFI: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నేతృత్వంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు పీఎఫ్ఐకి చెందిన పలు కార్యాలయాలపై దాడులు చేసింది. అలాగే, పీఎఫ్ఐకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసింది.
Popular Front of India: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ).. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయా సంస్థలకు చెందిన అగ్రనేతల కదలికలపై దృష్టి పెట్టిందని మహారాష్ట్ర టెర్రరిస్టు స్క్వాడ్ వర్గాలు చెప్పినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నేతృత్వంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు పీఎఫ్ఐకి చెందిన పలు కార్యాలయాలపై దాడులు చేసింది. అలాగే, పీఎఫ్ఐకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల దసరా సందర్భంగా బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని వారి కదలికలను పర్యవేక్షించాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాగ్పూర్ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్ఐ లక్ష్యాల జాబితాలో ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత వర్గాలు తెలిపినట్టు ఎన్డీటీవీ నివేదించింది. మహారాష్ట్రలో దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు పీఎఫ్ఐ ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ వర్గాలు తెలిపాయి. గత వారం 10 రాష్ట్రాల్లో జరిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నేతృత్వంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడుల క్రమంలో పీఎఫ్ఐకి చెందిన వందలాది మంది సభ్యులను అరెస్టు చేశాయి. వారిలో 20 మంది మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు.
గత వారం అనేక మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేసిన తర్వాత.. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పీఎఫ్ఐని నిషేధించాలని అసోం ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖను కోరింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. పిఎఫ్ఐ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున, ఒకే రాష్ట్రం దానిపై పోరాడజాలదనీ, అందువల్ల కేంద్రం దానిని నిషేధించాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అసోం పోలీసుల అదుపులో ఉన్న మినారుల్ షేక్ కీలక పీఎఫ్ఐ సభ్యుడని, అల్ ఖైదా మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాలున్నాయనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నామని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. షేక్ కు ఇస్లామిక్ స్టడీస్ లో డాక్టరేట్ ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను సంస్థ కోసం నిధులను మళ్లించిన కీలకమైన PFI సభ్యుడు. అతను 2019లో పౌరసత్వ (సవరణ) చట్టం లేదా CAAకి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల సమయంలో పీఎఫ్ఐ అసోం యూనిట్ నాయకత్వానికి మార్గదర్శకత్వం వహించాడు.