భార్యభర్తల మధ్య గొడవ.. పిల్లలను చెరువులోకి తోసేసి..
పిల్లలు ఇద్దరినీ చంపేసి అనంతరం తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలని వారు భావించారు.
కడుపున పుట్టిన బిడ్డలను అపురూపంగా చూసుకోవాల్సిందిపోయి... కర్కశంగా ప్రవర్తించారు. అభం శుభం తెలియని చిన్నారులనే కనికరం కూడా లేకుండా వ్యవహరించారు. కుటుంబంలో వచ్చిన చిన్న సమస్యలకే కుంగిపోయి.. ఇద్దరు బిడ్డలను తీసుకువెళ్లి చెరువులో పడేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రం కూడ్లిగి తాలుకా మల్లనాయకనహళ్లికి చెందిన చిరంజీవి కి కొన్ని సంవత్సరాల క్రితం నందినితో వివాహమైంది. వీరికి ఖుషి(3), కుమారుడు చిరు(1) ఉన్నారు. కాగా.. ఇటీవల భార్యభర్తల మధ్యలో గొడవలు మొదలయ్యాయి. అంతేకాకుండా.. అప్పుల బాధ కూడా పెరిగిపోయింది. దీంతో.. పిల్లలు ఇద్దరినీ చంపేసి అనంతరం తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలని వారు భావించారు.
అనుకున్నదాని ప్రకారం.. బైక్ పై పిల్లలను తీసుకొని రామదుర్గ చెరువు వద్దకు వెళ్లారు. ఆ చెరువులో ఇద్దరు చిన్నారులను తోసేశారు. అనంతరం వారు కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. వారికి ధైర్యం సరిపోలేదు. దీంతో.. ఆత్మ హత్య చేసుకోకుండా వెనక్కి వచ్చేశారు. అయితే.. బిడ్డలను కర్కశంగా చంపినందుకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.