గుజరాత్లో పశువులు ఒకదాని వెంట మరొకటి చనిపోతున్నాయి. ప్రాణాంతక చర్మ వ్యాధితో గోవులు, గేదెలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వైరస్తో గుజరాత్లో 1,126 పశువులు మరణించాయి.
అహ్మదాబాద్: గుజరాత్లో 1000కిపైగా పశువులు చర్మ వ్యాధితో మృత్యువాత పడ్డాయి. లంపీ స్కిన్ డిసీజ్తో గోవులు చనిపోతున్నాయి. లంపీ స్కిన్ డిసీజ్ కలుగజేసే వైరస్ రాష్ట్రంలోని 15 జిల్లాలకు వ్యాప్తి చెందింది. రాష్ట్రంలో పశువుల పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. దీంతో ప్రభుత్వం హుటాహుటిన నియంత్రణ చర్యలు చేపడుతున్నది.
ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం భుపేంద్ర పాటేల్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ప్రాణాంతక వైరస్ నుంచి పశువులను ఎలా కాపాడుకోవాలనే విషయంపై చర్చలు చేసినట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఈ వైరస్ నుంచి కాపాడటానికి సుమారు మూడు లక్షల పశువులకు వ్యాక్సిన్ వేశారు. 192 వెటెరినరీ అధికారులు, 438 లైవ్స్టాక్ ఎక్స్పర్ట్లతో ఈ వైరస్ పై సర్వేలతోపాటు పరిశీలనలు చేయిస్తున్నారు. పశువుల యజమానులకు ఈ వైరస్కు సంబంధించిన సమాచారం, ఒక వేళ ఈ వైరస్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్లు ప్రారంభించింది.
ఈ వైరస్ ఏ గ్రామంలో వెలుగులోకి వచ్చినా పెద్ద మొత్తంలో అంటే.. ఆ ప్రాంతానికి 5 కిలోమీటర్ల వ్యాసార్థం వైశాల్యంలో ఉన్న పశువులు అన్నింటికీ టీకాలు వేస్తున్నారు. గోవులు, గేదెల్లో ఈ వైరస్ కనిపిస్తున్నది. ఈ వైరస్ సోకిన పశువుల కోసం ప్రత్యేకంగా షెల్డర్ హోమ్నూ ప్రభుత్వం ప్రారంభించింది.
గుజరాత్లో ఈ వైరస్ ఇప్పటి వరకు 1,126 గోవులు, గేదెలకు సోకింది. దిసిస్, జామ్నగర్, కచ్, రాజ్ కోట్, సురేంద్ర నగర్, మోర్బి, దేవభూమి ద్వారకా, పోరుబందర్, భావ్నగర్, అమ్రేలీ, జునాగడ్, బోతాద్, గిర్ సోమనాథ్, బనస్కాంత, సూరత్, పటాన్ జిల్లాల్లోని గ్రామాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ ప్రభావం 41 వేల పశువుల్లో కనిపిస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
