ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం‌లో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం గురించి అత్యవసర సేవలను అప్రమత్తం చేసిన మొదటి వ్యక్తి ఒక ఎన్‌డీఆర్ఎఫ్ జవాన్ అని అధికారులు శనివారం తెలిపారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం‌లో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం గురించి అత్యవసర సేవలను అప్రమత్తం చేసిన మొదటి వ్యక్తి ఒక ఎన్‌డీఆర్ఎఫ్ జవాన్ అని అధికారులు శనివారం తెలిపారు. అతడు ప్రస్తుతం లీవ్‌లో ఉన్నాడని.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం  చేస్తున్నాడని పేర్కొన్నారు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం అప్‌ లైన్‌లో వస్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాంగ్ ట్రాక్‌లోకి ప్రవేశించి లూప్‌ లైన్‌లో నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దాని కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌తో సహా చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడిపోయాయి. డౌన్ లైన్‌లో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అధిక వేగంతో వాటిపైకి దూసుకెళ్లి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదాన్ని దాదాపు మూడు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా చెబుతున్నారు. 

అయితే ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్డీఆర్ఎఫ్ జవాన్ ఎన్‌కే వెంకటేష్ ప్రయాణిస్తున్నారు. అతడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి 2021లో ఎన్డీఆర్ఎఫ్‌లో చేరారు. అతడు కోల్‌కతాలో ఎన్డీఆర్ఎఫ్ 2వ బెటాలియన్‌లో పోస్ట్ చేయబడ్డాడు. అతడు ప్రస్తుతం సెలవుపై ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి తమిళనాడుకు వెళ్తున్నారు. అతని బీ-7 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. అతను థర్డ్ ఏసీ కోచ్‌లో ఉన్నారు.  అతని సీట్ నంబర్ 58. రైలు ఎక్కిన తర్వాత ఫోన్‌లో నిమగ్నమైన వెంకటేశ్.. ప్రమాదం  జరిగిన వెంటనే బోగీలో నుంచి బయటపడ్డారు. తక్షణమే ప్రమాదం గురించి అతనికి తెలియజేయడానికి బెటాలియన్‌లోని తన సీనియర్ ఇన్‌స్పెక్టర్‌కు మొదట ఫోన్ చేశారు. అతను వాట్సాప్‌లో ప్రమాదానికి సంబంధించిన ‘‘లైవ్ లొకేషన్’’ను ఎన్డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు పంపారు. స్పాట్‌కు చేరుకోవడానికి మొదటి రెస్క్యూ బృందాలు దీనిని ఉపయోగించాయని అధికారులు తెలిపారు. 

‘‘నాకు పెద్ద కుదుపుకు గురైనట్టుగా అనిపించింది. ఆ తర్వాత నా కోచ్‌లో కొంతమంది ప్రయాణికులు కిందపడిపోవడం చూశాను. మొదటి ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చి రైల్వే ట్రాక్‌కి సమీపంలోని దుకాణంలో కూర్చోబెట్టాను. తర్వాత ఇతరులకు సహాయం చేసేందుకు పరుగెత్తాను’’ అని వెంకటేష్ చెప్పారు. అక్కడ ఒక మెడికల్ షాపు యజమానితో సహా స్థానికులు బాధితులకు తమ వద్ద అందుబాటులో ఉన్నంత సాయం చేసి నిజమైన రక్షకులుగా మారారని అన్నారు. 

‘‘జవాన్ వెంకటేష్ తమిళనాడులోని తన ఇంటికి సెలవుపై వెళుతుండగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే కోల్‌కతాలోని తన సీనియర్‌లకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ బహుశా ఎన్డీఆర్‌ఎఫ్‌ను అప్రమత్తం చేసిన మొదటి కాల్. ఆ తర్వాత స్థానిక అధికార యంత్రాంగానికి కూడా సమాచారం అందించారు’’ అని ఓ అధికారి తెలిపారు.వెంకటేష్ గాయపడిన, రైలు చిక్కుకున్న ప్రయాణీకులను గుర్తించడానికి తన మొబైల్ ఫోన్ లైట్‌ను ఉపయోగించానని.. వారిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లాడని చెప్పారు. 

ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మొహసేన్ షాహెదీ ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘‘యూనిఫాం ధరించినా లేదా ధరించకపోయినా ఎన్డీఆర్ఎఫ్ జవాన్ ఎల్లప్పుడూ విధుల్లో ఉంటాడు’’ అని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం తరువాత మొదటి ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా రాష్ట్ర రెస్క్యూ బృందాలు సైట్‌కు చేరుకోవడానికి సుమారు గంట సమయం పట్టింది. ఈ సమయం వరకు వెంకటేష్ ‘‘గోల్డెన్ అవర్’’లో కొందరి ప్రాణాలను కాపాడటానికి అతను చేయగలిగినదంతా చేశారు.