పాక్ చెరలో పాతికేళ్లు... ఎట్టకేలకు స్వదేశానికి..!
1995 సంవత్సరంలో నేరం అని తెలియక పాకిస్తాన్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాడు. దీంతో అతన్ని భారత గూఢాచారిగా భావించిన పాకిస్తాన్ సైనికులు అరెస్ట్ చేసి జైలులో వేశారు.
తెలియక చేసిన పొరపాటుకి పాతికేళ్లు.. పాకిస్తాన్ జైలులో మగ్గిపోయాడు. తనవారు అందరికీ దూరమై అక్కడ పాతికేళ్లు నరకం అనుభవించిన ఆయన ఎట్టకేలకు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తన వాళ్లను కలుసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశా, సుందర్ఘర్ జిల్లాకు చెందిన బ్రిజు కుల్లు అనే వ్యక్తి 1995 సంవత్సరంలో నేరం అని తెలియక పాకిస్తాన్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాడు. దీంతో అతన్ని భారత గూఢాచారిగా భావించిన పాకిస్తాన్ సైనికులు అరెస్ట్ చేసి జైలులో వేశారు.
అలా పాతికేళ్లకు పైగా లాహోర్ జైలులో మగ్గిపోయాడు. కొద్దిరోజుల క్రితం అతన్ని విడుదల చేశారు. భారత్ చేరుకున్న అతడు 14రోజుల పాటు అమృత్సర్లోని కోవిడ్ హాస్పిటల్లో ఉన్నాడు. శుక్రవారం సుందర్ఘర్ జిల్లా అధికారులు అతడ్ని సొంత ఊరు జంగతేలికి తీసుకువచ్చారు. పాతికేళ్ల తర్వాత సొంతూరికి చేరుకున్న అతడికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. పాటలతో, ఆటలతో హంగామా చేశారు.