ఒడిశా కొత్త మంత్రివర్గం ప్రమాణం తీసుకుంది. 13 మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఎనిమిది మంది (స్వతంత్ర హోదా) మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు.
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కొత్త క్యాబినెట్ మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్ టీమ్లో ఈ సారి ఒకరి సంఖ్య పెరిగింది. గత క్యాబినెట్లో 20 మంది మంత్రులు ఉండేవారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కోసం వారంతా రాజీనామా చేశారు. తాజాగా, 21 మంది మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో లోక్ సేవా భవన్లోని కన్వెన్షన్ సెంటర్లో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో 13 మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్ బెర్తులు ఇచ్చినట్టు తెలిసింది. కాగా, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్వతంత్ర హోదా కింద మంత్రిత్వ శాఖలు ఇచ్చినట్టు సమాచారం. ట్రైబల్ లీడర్గా పేరున్న జగన్నాథ్ సరాకా క్యాబినెట్ మంత్రిగా తొలి ప్రమాణం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సరాకా క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు.
కాగా, ఐదు సార్లు ఎమ్మెల్యే, సీనియర్ బీజేడీ నేత నిరంజన్ పుజారీ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం తీసుకున్నారు. పుజారీతోపాటు అతాగడ్ ఎమ్మెల్యే రానేంద్ర ప్రతాప స్వెయిన్, మాజీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, చికిటి ఎమ్మెల్యే ఉషా దేవి, ఔల్ ఎమ్మెల్యే ప్రతాప్ దేబ్లతోపాటు ప్రఫుల్లా మల్లిక్, మహాకల్పద ఎమ్మెల్యే అతాను సబ్యసాచి నాయక్లు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతాను సబ్యసాచి నాయక్ ఎనిమిదేళ్ల విరామం తర్వాత తిరిగి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలోకి వచ్చారు.
ముగ్గురు మహిళలు ప్రమిలా మల్లిక్, ఉషా దేవి, తుకుని సాహులను క్యాబినెట్లోకి సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్నారు.
కాగా, సమీర్ రంజన్ దాస్, అశ్విని కుమార్ పాత్రా, ప్రీతి రంజన్ ఘదాయ్, శ్రీకాంత్ సాహు, తుషర్కంటి బెహెరా, రోహిత్ పుజారీ, రితా సాహు, బసంతి హేమ్బ్రమ్లు స్వతంత్ర హోదా మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు.
