హెల్త్ సెంటర్లోకి చొరబడి నర్సుపై సామూహిక అత్యాచారం.. చంపేస్తామని బెదిరింపు.. నిందితుల్లో మైనర్..
ఓ హెల్త్ సెంటర్లో నర్సును బంధించిన నలుగురు వ్యక్తులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నర్సుపై అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను రికార్డు కూడా చేశారు.
ఓ హెల్త్ సెంటర్లో నర్సును బంధించిన నలుగురు వ్యక్తులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నర్సుపై అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను రికార్డు కూడా చేశారు. ఈ నేరానికి పాల్పడినవారిలో ఒక మైనర్ కూడా ఉన్నారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్లోని మహేంద్రగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. బాధిత మహిళ హెల్త్ సెంటర్లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. శుక్రవారం హెల్త్ సెంటర్ ఆమె ఒంటరిగా విధులు నిర్వర్తించడం నిందితులు గుర్తించారు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిందితులు హెల్త్ సెంటర్లోకి ప్రవేశించి.. నర్సును కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై అత్యాచారం జరుపుతున్న దృశ్యాలను రికార్డు చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం బాధితురాలు.. తన తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా సీనియర్ పోలీసు అధికారి నిమేష్ బరయ్య తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టుగా వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నారని తెలిపారు.
ఈ ఘటనపై ఛత్తీస్గఢ్లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. వైద్య సిబ్బంది, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. భూపేష్ భగెల్ నేతృత్వంలోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు.
ఈ ఘటన అనంతరం మారుమూల ప్రాంతాల్లో పని చేయడంపై ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘‘మాకు రక్షణ కావాలి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే మేం పని చేయబోం’’ అని జిల్లాలోని ఓ ఆరోగ్య కేంద్రంలోని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.