మధ్యప్రదేశ్‌లో రోడ్డు నిర్మాణం అధ్వాన్నంగా ఉన్నందుకు కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ  ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఈ రోడ్డు వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మంగళవారం నాడు మండల, జబల్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని రహదారుల గురించి ప్రస్తావించారు. ఇందులో మండల-జబల్‌పూర్‌ హైవే గురించి చర్చిస్తూ.. హైవే నిర్మాణంలో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు.

మళ్లీ టెండర్లకు ఆదేశం

అతి త్వరలో కొత్త టెండర్లు వేయాలని, ఆ రోడ్డు నిర్మాణ పనులను మరింత మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రోడ్ల అభివృద్ధే దేశాభివృద్ధిగా అభివర్ణించారు. తప్పు జరిగితే.. దానికి క్షమాపణ కూడా చెప్పాలని అన్నారు. కొత్త టెండర్‌ వేసి, ఆ రోడ్డును త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 

ఐదు జాతీయ రహదారులకు శంకుస్థాపన 

దీనితో పాటు కన్హా నేషనల్ పార్క్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందనీ అన్నారు. త్వరలో ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ మెరుగుపడనున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్కరీ రూ. 1261 కోట్లతో ఐదు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు. మండల, కన్హా నేషనల్ పార్క్ ప్రకృతి అందాలు నిత్యం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణంతో ఈ ప్రాంతం, అటవీ వాసులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు.