అత్తారింటికి వెళ్తుండగా ప్రమాదం... నవ వధువు కన్నుమూత
ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
అత్తారింటికి ఆనందంగా వెళ్తున్న ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నౌర్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బఢాపూర్ నివాసి పూజకు ఫిబ్రవరి 16న కిరత్పూర్ పరిధిలోని మెచీపురా గ్రామంలో వివాహమైంది. శుక్రవారం పూజాది కార్యక్రమాలు ముగించుకుని తన అత్తవారింటికి కారులో వెళుతుండగా నజీబాబాద్లో రాయపూర్ రోడ్డు సమీపంలో ఒక ట్రాక్టర్ ట్రాలీ వీరి కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో నూతన వధువు అక్కడికక్కడే మృతి చెందగా, వరునితోపాటు మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. కాగా ఈ దుర్ఘటనలో గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ట్రాలీ యజమాని గురించి తెలుసుకునే పనిలోపడ్డారు.