ప్రతి నాలుగు నుంచి ఆరు నెలలకు ఒక కొత్త వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, బూస్టర్ డోసు తప్పకుండా వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కాలంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుందని, కాబట్టి, మూడో డోసు వేసుకోవడం అవసరం అని వివరించారు.

న్యూఢిల్లీ: ప్రతి నాలుగు నుంచి ఆరు నెలలకు ఒక కొత్త కరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి, బూస్టర్ షాట్ వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సూచించారు. బలహీనులకు.. అంటే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు తప్పకుండా మూడో డోసు వేసుకోవాలని వివరించారు. కరిగిపోతున్న రోగ నిరోధక శక్తిని మళ్లీ బలోపేతం చేయడానికి బూసర్ట్ షాట్ చాలా అవసరం అని సౌమ్య స్వామినాథన్ అన్నారు. ముఖ్యంగా బలహీనుల్లో అంటే వయోధికులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి చాలా ముఖ్యం అని వివరించారు.

ప్రతి నాలుగు నుంచి ఆరు నెలల్లో ఒక కొత్త వేవ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఆ వేవ్ తీవ్రత అప్పడు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఎంత మంది ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

కొన్ని నెలల పాటు కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూన్ నెల ఆరంభం నుంచి కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నది. ఈ పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వివరించారు. బీఏ 4, బీఏ 5 వంటి అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే సామార్థ్యాలు ఉన్న సబ్ వేరియంట్లు ప్రస్తుతం వ్యాపిస్తున్నాయని తెలిపారు. అదే విధంగా, కరోనాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, వ్యాధి నిరోధక శక్తులు సన్నగిల్లడం మరో కారణం అని వివరించారు. వీటితోపాటు ప్రజల ప్రవర్తనల్లోనూ వచ్చిన మార్పు మరో కారణం అని తెలిపారు. కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇండోర్‌లలో మాస్కులు ధరించకుండా ప్రజలు గుమిగూడుతున్నారని వివరించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,22,017కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 3,16,179 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 8,582 మంది పాజిటివ్‌గా తేలినట్టుగా తెలిపింది. కిందటి రోజు దేశంలో కొత్తగా 8,329 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఇక, గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,24,761కి పెరిగింది. తాజాగా కరోనా నుంచి 4,435 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,26,52,743కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 44,513 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య.. 0.10 శాతంగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇక, కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 2.71 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.02 శాతంగా ఉంది. 

భారత్​లో శనివారం 13,04,427 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,07,08,541కు చేరింది.