ఓఎన్జీసీలో అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి
ఓఎన్జీసీ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ముంబై:ముంబై ఓఎన్జీసీలో గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంటులో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నవీ ముంబైలోని ఉరాన్ ప్రాంతంలో ఓఎన్జీసీ ప్లాంటు ఉంది. ఈ ప్లాంటులో మంగళవారం నాడు ఉదయం 6:45 గంటలకు అగ్ని ప్రమాదం సంబవించింది.క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పలువురు కార్మికులు ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రమాదం కారణంగా బయటకు రాలేక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉందని సమాచారం.
ఉరాన్, పన్వేల్, జేఎన్పీటీ, నెరూల్ ప్రాంతాల నుండి ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటన స్థలానికి కిలోమీటరున్నర దూరం వరకు ఎవరిని కూడ అనుమతించడం లేదు. ఉరాన్ నుండి గ్యాస్ ను గుజరాత్ హజీరా ఓఎన్జీసీ ప్లాంట్ కు తరలిస్తున్నారు.