Asianet News TeluguAsianet News Telugu

హనుమంతుడి జన్మస్థలానికి దక్కిన అదృష్టం.. కొలువుతీరనున్న మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రాములవారు..

డిసెంబరు 30న మూడు రామ్ లల్లా విగ్రహాలపై ఓటింగ్ జరిగింది. అత్యధిక ఓట్లు వచ్చిన విగ్రహాన్ని అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో ఏర్పాటు చేయడానికి ఎంపిక చేశారు. 

Mysuru sculptor Arun Yogiraj's Ram Lalla idol selected for Ayodhya Temple - bsb
Author
First Published Jan 2, 2024, 9:41 AM IST

అయోధ్య : కర్నాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 'రామ్ లల్లా' విగ్రహాన్ని అయోధ్యలోని రామాలయంలో ప్రతిష్టించనున్నారు. యోగిరాజ్ స్వస్థలం మైసూరు. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. 

మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య ఆలయంలో ప్రతిష్టించేందుకు ఎంపిక చేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటించారు.

"'రాముడు ఎక్కడ ఉంటే.. హనుమంతుడు అక్కడే'.. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కోసం విగ్రహం ఎంపిక ఖరారైంది. దేశం గర్వించదగ్గ ప్రముఖ శిల్పి శ్రీ అరుణ్ యోగిరాజ్. ఆయన చెక్కిన శ్రీరాముని విగ్రహం అయోధ్యలో ప్రతిష్టించబడుతుంది. రాముడికి, హనుమంతునికి ఉన్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. లాండ్ ఆఫ్ హనుమా అయిన కర్ణాటక నుండి రాంలల్లా విగ్రహం ఎంపిక కావడం సంతోషకరం’’ అని ఆయన ఒక X పోస్ట్‌లో పేర్కొన్నారు.

'X'లో తన ఆనందాన్ని పంచుకుంటూ, బిజెపి అగ్రనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప.. "మైసూర్‌లోని శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీరాముని విగ్రహం అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక కావడం సంతోషదాయకం. రాష్ట్రంలోని రామ భక్తులందరికీ గర్వకారణం. 'శిల్పీ @యోగిరాజ్_అరుణ్'కి హృదయపూర్వక అభినందనలు" అని తెలిపారు. 

యడియూరప్ప కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా యోగిరాజ్‌ రాష్ట్రాన్ని, మైసూరును గర్వించేలా చేశారని కొనియాడారు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 22న అయోధ్యలో ప్రతిష్టించడం కర్ణాటకకు గర్వకారణమని, మైసూరుకు గర్వకారణమని విజయేంద్ర అన్నారు. హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ రాష్ట్రంలో ఉన్నందున కర్ణాటకకు శ్రీరాముడితో లోతైన అనుబంధం ఉందని ఆయన అన్నారు. రాముని భక్తుడైన హనుమంతుడు జన్మించిన ప్రాంతం కిష్కింధ.

అయోధ్యలో బాలరాముడి విగ్రహా ఎంపిక పూర్తి.. కొలువుతీరనున్న51 అంగుళాల శ్యామవర్ణ విగ్రహం...

'ఇంకా అధికారిక సమాచారం రాలేదు' : అరుణ్ యోగిరాజ్
తాను చెక్కిన విగ్రహం అంగీకరించారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదని శిల్పి అరుణ్ యోగిరాజ్ వార్తా సంస్థ పిటిఐతో అన్నారు. అతని ప్రకారం, 'రామ్ లల్లా' విగ్రహాన్ని చెక్కడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఎంపిక చేసిన ముగ్గురు శిల్పులలో అతను కూడా ఉన్నాడు. ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని చెక్కడానికి ఎంపికైన దేశంలోని ముగ్గురు శిల్పులలో నేనూ ఒకడిని కావడం సంతోషంగా ఉంది’’ అని యోగిరాజ్ అన్నారు.

"విగ్రహం బాల రాముడిలా ఉండాలి. దైవత్వం ఉట్టిపడాలి. భగవంతుని అవతార విగ్రహం. విగ్రహాన్ని చూసే భక్తులు అందులో దైవత్వాన్ని చూడగలగాలి’’ అని యోగిరాజ్ అన్నారు. "ఐదేళ్ల వయసున్న చిన్నపిల్లాడి ముఖంలో, దైవత్వం ఉట్టిపడేలా చేయడానికి శ్రమించాలి. దీనికోసం నాకు ఆరు నుండి ఏడు నెలలు సమయంపట్టింది.  ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను తయారు చేసిన విగ్రహం ఎంపిక చేస్తారో లేదో అనేదానికంటే.. ప్రజలు మెచ్చుకుంటే అప్పుడే నాకు చాలా సంతోషం" అని శిల్పి అన్నాడు.

అరుణ్ యోగిరాజ్ అంతకుముందు కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని, ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రూపొందించారు. రాముడి విగ్రహం తయారు చేయడం సవాలుతో కూడుకున్నదని అంగీకరించారు.

రాముడి విగ్రహం ఎంపిక కోసం ఓటింగ్
రామ్ లల్లా మూడు విగ్రహాలపై ఓటింగ్ డిసెంబరు 30న జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ధర్మకర్తల మండలి మొత్తం మూడు రామ్ లల్లా విగ్రహాలను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవడానికి తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా ట్రస్టుకు అందజేసింది. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ్ పాండేతో పాటు రామ్ లల్లా మూడు విగ్రహాలను చెక్కారు.

కర్ణాటకకు చెందిన శిల్పులు నల్లరాళ్లను ఉపయోగించగా, రాజస్థాన్‌కు చెందిన శిల్పి తెల్లని మక్రానా పాలరాయిని ఉపయోగించారు. ముంబైకి చెందిన ప్రముఖ కళాకారుడు వాసుదేవ్ కామత్ ట్రస్ట్‌కు సమర్పించిన స్కెచ్ ఆధారంగా రామ్ లల్లా విగ్రహాలు రూపొందించబడ్డాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios