ఈ వినాయకుడు చాలా రిచ్ గురూ.. రూ.316 కోట్ల బీమా.. !
గణేష్ చతుర్థి వేడుకలు: గౌడ్ సారస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్ గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా మొదటిసారిగా 316.40 కోట్ల రూపాయల బీమాను తీసుకుంది. దీంతో మండలానికి వచ్చే ప్రతి భక్తుడు 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు బీమా పరిధిలోకి వస్తాడు.
వినాయక చతుర్థి వేడుకలు: దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక రకాలైన వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టి పూజా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక గణనాధుని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ వినాయకుడు చాలా రిచ్.. ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా బీమా తీసుకున్నాడు. ఇది మీకు విచిత్రంగా అనిపించిన ఇది నిజం.. ఆ వివరాలు మీ కోసం.. !
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా కోవిడ్-19 పరిమితులు, లాక్డౌన్ల కారణంగా ఆంక్షల మధ్య వినాయక చతుర్థి వేడుకలు జరుపుకున్నారు. ఇప్పుడు ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేకుండా గణేష్ చతుర్థి మొదటి బహిరంగ వేడుకను గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వినాయకుడి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ.. వెనక్కి తగ్గేదే లే అంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు అక్కడి భక్తులు. ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా బీమా కవరేజీ తీసుకుంది ఒక మండలం. అదే గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్. గణేస్ చతుర్థి వేడుకల్లో భాగంగా జీఎస్బీ సేవా మండల్ రూ.316.4 కోట్ల బీమా తీసుకుంది. దీంతో 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల నేపథ్ంలో మండలానికి వచ్చే ప్రతి భక్తుడికి బీమా వర్తిస్తుంది. ఒక మండలం తీసుకున్న అత్యధిక బీమా కవరేజీ ఇదేనని ఓ వాలంటీర్ పేర్కొన్నారు.
ముంబైలోని అత్యంత ధనిక గణేష్ మండపాలలో ఒకటైన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్ రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం రూ.316.40 కోట్ల బీమా రక్షణ పొందిందని సంబంధిత సేవకులు పేర్కొన్నారు. జీఎస్బీ సేవా మండల్ 1955లో సెంట్రల్ ముంబైలోని మాతుంగాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో స్థాపించబడింది. ఇది ఒక స్వచ్ఛంద సేవ సంస్థ. గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్ ఛైర్మన్ విజయ్ కామత్ మాట్లాడుతూ "అన్ని ప్రజా బాధ్యతలు, మండలాన్ని సందర్శించే ప్రతి భక్తుడు 10 రోజుల ఉత్సవాలకు బీమా పరిధిలోకి వస్తారు" అని తెలిపారు. అలాగే, మండల్ ఫర్నీచర్, ఫిక్చర్లు, ఫిట్టింగ్లు, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్ల వంటి ఇన్స్టాలేషన్లను కూడా ఈ బీమా కవర్ చేస్తుందని తెలిపారు. అలాగే, భూకంప ప్రమాదంతో కూడిన రూ. 1 కోటి ప్రామాణిక ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీని కూడా తీసుకుంది. తాము అత్యంత క్రమశిక్షణ కలిగిన గణేష్ మండల్ కాబట్టి ఇక్కడకు వచ్చే ప్రతి గణనాధుని భక్తులను సురక్షితంగా ఉంచడం తమ బాధ్యత అని తెలిపారు.
రూ. 316.4 కోట్ల విలువైన ఈ బీమా.. మండల్ లోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీని కలిగి ఉందని తెలిపారు. పండల్, వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, ఫుట్వేర్ స్టాల్ కార్మికులు, వాలెట్ పార్కింగ్ వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులకు రూ. 263 కోట్ల వ్యక్తిగత బీమా కవర్ ఉంటుందని పేర్కొన్నారు.