వరదలో చిక్కుకున్న మహాలక్ష్మీ ఎక్స్ప్రెస్, రైల్లో 2000 మంది
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రైల్వే ట్రాక్స్పై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ముంబై-కొల్హాపూర్ల మధ్య నడిచే మహాలక్ష్మీ ఎక్స్ప్రెస్ వరదనీటిలో చిక్కుకుంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైని మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రైల్వే ట్రాక్పై భారీగా వరద నీరు ప్రవహించడంతో ముంబై-కొల్హాపూర్ల మధ్య నడిచే మహాలక్ష్మీ ఎక్స్ప్రెస్ రైలు బద్లాపూర్-వాంగనీ మధ్య వరద నీటిలో చిక్కుకుపోయింది.
దాదాపు 2 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో డ్రైవర్ రైలును నిలిపివేసి.. అధికారులకు సమాచారం అందించాడు. దీంతో తెల్లవారుజామున నుంచి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరద నీటితో పాటు పాములు, విష కీటకాలు ఎక్కడ బోగీల్లోకి వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిటీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి లైఫ్ జాకెట్లు, బోట్లతో పాటు వాయుసేన హెలికాఫ్టర్లను సైతం సిద్ధం చేశారు. కాగా.. రైలు ట్రాక్పై నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.