ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లోని ఎంపీ కోటాను రద్దు చేస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి.  

కేంద్రీయ విద్యాలయాల్లో (kendriya vidyalayas) ఎంపీల ప్రత్యేక సీట్ల కోటా (mp quota) రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (kendriya vidyalaya sangathan) బుధవారం అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వులతో ఆ కోటా పూర్తిగా రద్దయ్యింది. పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిర్ణయం తీసుకుంది. అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏకంగా కోటా మొత్తం రద్దు చేయడం గమనార్హం.

అంతకుముందు లోక్‌సభలో (loksabha) కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై చర్చ జరిగింది. అయితే, కోటాను ఎత్తి వేయాలని కొందరు.. పెంచాలని మరికొందరు డిమాండ్ చేశారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. పది సీట్ల కోటా సరిపోదని.. దాన్ని పెంచాలని.. లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అయితే, ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని ధర్మేంద్ర ప్రధాన్‌ (dharmendra pradhan) పార్లమెంట్‌కు తెలియజేశారు. ఆ సమయంలో మంత్రి నిర్ణయాన్ని పలువురు ఎంపీలు వ్యతిరేకించారు. అయితే ఆయన చెప్పినట్లుగానే ఈ రోజు ఆదేశాలు రావడం విశేషం.