కర్ణాటకలో దారుణం : కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి.. ఆపై...!!
హసన్ జిల్లా బెలూర్ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన గురువారం ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనె సంచుల మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా అందులో కోతులు కనిపించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు అప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి.
కర్ణాటక : మనుషుల్లో మానవతా విలువలు తగ్గిపోతున్నాయ్ అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. కోతులకు విషం పెట్టి, గోనెసంచిలో కుక్కి, తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి.
ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హసన్ జిల్లా బెలూర్ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన గురువారం ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనె సంచుల మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా అందులో కోతులు కనిపించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు అప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి.
మొత్తం 30 వానరాలు చనిపోగా మరో 20 గాయపడ్డాయి. దీంతో ఆ యువకులు గాయపడిన కోతులను బయట తీసి నీరు తాగించారు. ఇందులో 18 కోతులు కోలుకోగా.. మరో రెండింటి వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.వానరాలకు విషం పెట్టి, సంచుల్లో కుక్కారని.. సంచుల పైనుంచి బలంగా కొట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు.
మరణించిన వానరాలకు పోస్టుమార్టం నిర్వహించగా విషం ఆనవాళ్లు కనిపించినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణ్ దీప్ హుడా తన ట్విటర్ లో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.