సారాంశం

Manipur: హింసాత్మక మణిపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించిన వీడియో  చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీంతో ఈ వీడియోపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది.

Manipur: మానవాళికి అత్యంత అవమానకరమైన సంఘటన హింసాత్మక మణిపూర్‌లో వెలుగులోకి వచ్చింది. పట్టపగలు రాష్ట్రంలో కీచక పర్వం కొనసాగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురు గిరిజన యువతులను నగ్నంగా ఊరేగించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం వారిని హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ సమీపంలోని నాంగ్‌పోక్‌ సెక్మాయ్‌ సమీపంలో మే 4న చోటుచేసుకుంది. బుధవారం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా.. ఇద్దరు బాధితులను దుండగులు హతమార్చినట్లు పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ స్పష్టం చేస్తోంది. 

మణిపూర్‌లో  మైతేయిలు, కుకీల మధ్య హింస చోటుచేసుకున్న నేపథ్యంలో పలుదారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన మే 3వ తేదీ తర్వాతి రోజు  ఇండిజినస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం(ఐటీఎల్‌ఎఫ్‌) ఆరోపించింది. బాధిత మహిళలు కుకీ-జో తెగకు చెందినవారని ఐటీఎల్‌ఎఫ్‌ వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ ఎస్టీ కమిషన్‌ ఈ ఘటనపై స్పందించాలని కోరారు.

పోలీసులు కేసు నమోదు 

ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వీడియో మే 4 నాటిదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని, గుర్తుతెలియని దుండగులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య తదితర కేసులను నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కె మేఘచంద్ర సింగ్ తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. 

రాజకీయ విమర్శలు

మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయాలు జోరందుకున్నాయి. మణిపూర్‌లో భారతావనిపై దాడి జరుగుతోందని, ప్రతిపక్ష పార్టీల కూటమి ‘భారత్‌’ మౌనంగా ఉండదని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మణిపూర్ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి ఒక్కటే ముందున్న మార్గమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం మణిపూర్‌ను అరాచకం వైపు నెట్టిందని ఆరోపించారు.

మహిళల వైరల్ వీడియోపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఉద్దేశించిన వీడియోపై స్పందించారు. మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల భయంకరమైన వీడియో ఖండించదగినది , అమానవీయమైనది అని స్మృతి ఇరానీ అన్నారు. సిఎం ఎన్ బీరేన్ సింగ్‌తో మాట్లాడనని, ఈ అంశంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలియజేసారు.   దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అదే సమయంలో బిజెపి నాయకుడు , ఐటి సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా కూడా పోలీసుల ప్రెస్ నోట్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. రాష్ట్రంలోని  వివిధ సున్నితమైన ప్రాంతాలలో రాష్ట్ర పోలీసులు , కేంద్ర బలగాలు కొనసాగుతున్న దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.