ఢిల్లీలో సహజీవనంలో ఉన్న భాగస్వామిని ఆ వ్యక్తి గొంతు నులిమి చంపేశాడు. ఆమె నివాసం ఉంటున్న అద్దె గదిలోనే చంపేసి డెడ్ బాడీని మరో ఇద్దరి సహాయంతో యమునా ఎక్స్ప్రెస్పై వదిలిపెట్టాడు. పొరుగు మహిళకు డబ్బులు పంపించడంపై వివాదం మొదలైనట్టు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గోవింద్పురి ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళనే హతమార్చాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఆమె అద్దెకు ఉన్న గది నుంచి ఎవరికీ తెలియకుండా మరో ఇద్దరి సహాయంతో డెడ్ బాడీని తెచ్చాడు. యమునా ఎక్స్ప్రెస్పై వదిలిపెట్టి వచ్చారు. చిన్న విషయమై వారి మధ్య గొడవ జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది.
జులేఖ బీబీ ఖాన్ అలియాస్ రేఖ అనే యువతి బ్రజేష్ ఇంటిలో అద్దెకు ఉంటున్నది. ఆమెతో ఓం ప్రకాశ్ అనే వ్యక్తి సహజీవనంలో ఉన్నాడు. వీరిద్దరు తరచూ కలవడాన్ని బ్రజేష్ గమనించాడు. అయితే, అకాస్మత్తుగా జులేఖ కనిపించకుండా పోయింది. దీంతో బ్రజేష్ జులై 7వ తేదీన పోలీసులను ఆశ్రయించి జులేఖ కిడ్నాప్కు గురైనట్టు ఫిర్యాదు ఇచ్చాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఇతర విధాల్లో దర్యాప్తు చేశారు. వారి దర్యాప్తులో జున్ 26వ తేదీన ముగ్గురు వ్యక్తులు జులేఖ డెడ్ బాడీని ఆమె అద్దెకు ఉంటున్న గది నుంచే రహస్యంగా ఓ కారులో తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో వారు ఉంటున్న నివాసాలపై రైడ్లు చేశారు. కానీ, వారు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు.
సర్వెలెన్స్, ఫోన్ నెంబర్లు, బంధువులను ప్రశ్నించి ఎట్టకేలకు ఆ ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఓం ప్రకాశ్తోపాటు ఆయనకు సహకరించిన రాజ్కుమార్, సంజయ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
ఈ దర్యాప్తులో ఓం ప్రకాశ్ నిజాలను ఒప్పుకున్నాడు. జులేఖ బీబీ ఖాన్తో తాను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్టు పోలీసులకు చెప్పాడు. అయితే, పొరుగునే ఉండే ఓ మహిళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంపై ఓం ప్రకాశ్కు, జులేఖకు మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ ముదిరి పాకాన పడింది. అదే అద్దె గదిలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలోనే ఓం ప్రకాశ్ చివరకు జులేఖను చంపేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది.
పోలీసులకు ఆ డెడ్ బాడీ లభించింది. అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెను గొంతు నులిమి చంపేసినట్టు పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో 302 సెక్షన్ను కూడా పోలీసులు యాడ్ చేశారు.
