కొడుకుని అమ్మకానికి పెట్టిన తండ్రి.. ఎవరూ కొనడం లేదని..
అంతేకాకుండా.. కొడుకును అమ్మడానికి తరచూ భార్య అడ్డు రావడం మొదలుపెట్టింది. దీంతో కోపంతో పసివాడనే కనికరం లేకుండా కొడుకును దారుణంగా చంపేశాడు.
అతనికి లేని దుర అలవాటు అంటూ ఏదీ లేదు. నిత్యం మద్యం సేవిస్తూ.. పేకాడుతూ జీవిస్తూ ఉంటాడు. ఏ పనీ చేయకుండా.. డబ్బులు వస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాగడానికి.. పేకాటకు డబ్బులు లేవని.. తన మూడేళ్ల కొడుకును మూడు లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టాడు. అయితే.. అతనిని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా.. కొడుకును అమ్మడానికి తరచూ భార్య అడ్డు రావడం మొదలుపెట్టింది. దీంతో కోపంతో పసివాడనే కనికరం లేకుండా కొడుకును దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన మహ్మద్ నౌషద్కు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. కూలీగా జీవనం సాగించే నౌషద్ తరచుగా పేకాట ఆడుతూ, మద్యం సేవిస్తూ గడిపేవాడు. అయితే అతను పేదవాడు కావడంతో సరిపడా డబ్బులు ఉండేవి కావు. దీంతో తన మూడేళ్ల కొడుకుని ఎవరికైనా అమ్మెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తన కొడుకును మూడు లక్షల రూపాయలకు అమ్మేసి ఆ డబ్బుతో జల్సాగా గడపాలనుకున్నాడు. అయితే ఎవరూ చిన్నారిని కొనేందుకు ముందుకు రాలేదు.
ఈ విషయమై భార్యతోనూ, తండ్రితోనూ నౌషద్ తరచుగా గొడవపడుతుండేవాడు. గత మంగళవారం రాత్రి భార్యను ఫోన్ ఛార్జర్ కోసం పక్కింటికి పంపిన నౌషద్ ఆమె తిరిగి వచ్చే లోపు కొడుకు గొంతు నులుమి చంపేశాడు. హాస్పిటల్కు తీసుకెళ్లే సరికే ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. దీంతో నౌషద్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నౌషద్ను అరెస్ట్ చేశారు.