మెజార్టీ ముస్లిం మహిళలు ఉమ్మడి పౌరస్మృతిని సమర్థిస్తున్నారు. న్యూస్ 18 సర్వేలో ఈ కీలక విషయం తెలిసింది. పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తగత విషయాలు కామన్ సివిల్ కోడ్ అదుపులో ఉంటాయి.
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ముస్లిం సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అన్ని మతాలను ప్రభావితం చేస్తుందని వాదిస్తున్నారు. కానీ, అదే ముస్లిం మహిళలు మాత్రం ఇందుకు భిన్నమైన వాణి వినిపిస్తున్నట్టు న్యూస్ 18 నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. మెజార్టీ ముస్లిం మహిళలు ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వ ఆస్తుల విషయమై 67.2 శాతం మంది ముస్లిం మహిళలు ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు తెలుపుతున్నారు.
25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 8,035 మంది ముస్లిం మహిళలను న్యూస్ 18 సర్వే చేసింది. ఈ సర్వేలో 18 నుంచి 65 ఏళ్ల మహిళలు, భిన్నమైన కమ్యూనిటీలు, ప్రాంతాలు, విద్యార్హతలు గలవారు పాల్గొన్నారు. వివాహితులు, అవివాహితులు కూడా పాల్గొన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి మతాలకు అతీతంగా దేశ పౌరులందరికీ వర్తిస్తుంది. ఇది పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టం.
సర్వేలో తేలిందేమిటంటే?
ఉమ్మడి పౌరస్మృతిని సమర్థిస్తారా? అని అడగ్గా.. 67.2 శాతం మంది మహిళలు ఔను అని చెప్పారు. 25.4 శాతం మంది మహిళలు మాత్రం సమర్థించబోమని సమాధానం ఇచ్చారు. 7.4 శాతం మాత్రం ఏమీ చెప్పలేమని అన్నారు.
Also Read: AI Anchor: వార్తలు చదివే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) యాంకర్.. వైరల్ వీడియో ఇదే
భిన్నమైన విద్యార్హతలు గల ముస్లిం మహిళల అభిప్రాయాలు చూస్తే.. 68.4 శాతం అంటే 2,076 మంది డిగ్రీ పట్టా పొందిన మహిళలు కామన్ సివిల్ కోడ్ను సమర్థిస్తున్నారు. అదే 27 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
వయసు రీత్యా చూసుకుంటే 18 నుంచి 44 ఏళ్ల వయసుగల మహిళలు 69.4 శాతం మంది యూసీసీకి మద్దతు ఇస్తున్నట్టు వివరించారు. 24.2 శాతం మంది మహిళలు మాత్రం ఉమ్మడి పౌరస్మృతి తమకేమీ అక్కర్లే దని చెప్పారు.
