ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దుప్పట్లలోనే ప్రసవం.. పసికందు మరణం
మహారాష్ట్రలోని థానేలో కనెక్టివిటీ, వైద్య సదుపాయాల కొరత కారణంగా ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ తన బిడ్డను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ తన నవజాత కవలలను కోల్పోయిన కొద్దిసేపటికే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది
అడవి బిడ్డలు సంక్షేమం కోసం ఎన్నో చేశామనీ, ఎంతో చేస్తున్నామనీ నాయకులు లెక్కలు చూపుతుంటారు. గిరిజనుల అభివృద్ది కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుతుంటారు. మాటల్లోనే చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో గిరిజనుల పరిస్థితి.. అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వారి పరిస్థితి గడు దయనీయంగా ఉంది. ఆ అమాయకుల గోడు వినే నాధుడే లేదు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వారి ముఖాలు చూసే నేతలే తప్ప.. తమ గోడును పట్టించుకునే వారు లేరు.
తాజాగా.. శాస్త్ర విజ్ఞానంలో దేశం ఎంతో అభివృద్ది సాధించినా.. గిరిజన గ్రామాలకు నేటికీ కనీస రవాణా సౌకర్యాన్ని నేతలు కల్పించలేకపోతున్నారు. తాజాగా.. ఆస్పత్రికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రసవ వేదన పడుతున్న ఓ గర్భిణీని.. దుప్పట్లో మోసుకుని ఆస్పత్రికి తీసుకవెళ్లాల్సి వచ్చింది. మార్గ మధ్యలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ.. దురదృష్టశాత్తు.. ఆ బిడ్డకు సరైన వైద్యం అందకపోవడంతో.. కొన్ని గంటల్లోనే ఆ పసికందు మరణించింది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి సమీపంలోనే ఉన్న ఒక గ్రామంలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 తేదీన ఉదయం 7 గంటల ప్రాంతంలో నొప్పులు వచ్చాయి. అయితే.. వారు నివసిస్తున్న గ్రామం నుండి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో ఆ గ్రామానికి చెందిన యువకులు దుప్పట్లో ఆమెను పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో డషానా ప్రసవించింది. వీలైన త్వరగా .. ఆ గర్బిణీని, ఆ పసికందును ఆసుపత్రికి తీసుకెళ్దామని ప్రయత్నించారు. కానీ.. ఆ చిన్నారి చడిచప్పుడు లేకుండా నిచ్చలంగా ఉంది. తీరా ఆ చిన్నారిని పరిశీలిస్తే.. మరణించింది.
ఈ ఘటనతో ఆ గ్రామస్థులు నేతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తమ గ్రామానికి 1.5 కి.మీ దూరంలో ఉందనీ, అప్రోచ్ రోడ్డు కావాలని గత పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నామని, అయినా తమ భాదను పట్టించుకున్న నాథుడు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్గం దాటి ఆరోగ్య కేంద్రానికి చేరుకోవడానికి కనీసం 30-45 నిమిషాలు పడుతుంది. గురువారం నాడు ప్రసవ వేదనతో దర్శన్ కేకలు వేయడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. బెడ్షీట్ లో ఆమెను పడుకో బెట్టి.. ఆస్పత్రికి బయల్దేరాం. సగానికి చేరుకున్నాం.. అప్పటికే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాం. అయితే చిన్నారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో .. ఆ చిన్నారి చనిపోయింది ’’ అని గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. భివాండి తహసీల్దార్ ఆదిక్ పాటిల్ మాట్లాడుతూ, "నేను నా సిబ్బందిని పంపి, ఈ విషయాన్ని విచారించి, అవసరమైన చర్యలు తీసుకుంటాను. అని తెలిపారు.