ఈ వీడియో చూడగానే పోలీసులకు అనుమానం వచ్చింది. వీడియో అప్‌లోడ్ చేసిన సమయంలోనే అదే ప్రాంతంలో ఓ చోరీ జరిగింది. ఆ బాలుడే ఈ దొంగతనం చేశాడా అనే అనుమానం కలిగి, విచారణ చేశారు.


ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ చేతిలో లేనివారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడీయాను ఉపయోగించేవారే. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ చేసి ఫేమస్ అవ్వాలని కోరుకునేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలనే తాపత్రయం పెరిగిపోతోంది. అలా ఫేమస్ కావడం కోసం, వింత వింత ప్రయోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుర్రాడు, ఖరీదైన హోటల్ కి వెళ్లి, నోట్ల కట్టలతో రీల్ చేశాడు. ఆ రీల్ వైరల్ అయ్యింది. అంత పిల్లాడికి అంత డబ్బు ఎక్కడ వచ్చిందా అని పోలీసులు విచారణ చేయగా, షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ కుర్రాడు ఇటీవల కాన్పూర్ లోని ఓ ఖరీదైన హోటల్ కి వెళ్లాడు. ఓ హోటల్ గదిని బుక్ చేసుకొని అందులో ఇన్ స్టాగ్రామ్ రీల్ చేశాడు. అయితే, మామూలుగా రీల్ చేస్తే ఫేమస్ కాను అని, ఆ బాలుడు బెడ్ మీద నోట్ల కట్టలు గా పోసి మరీ రీల్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసుల వరకూ వెళ్లింది. అయితే ఈ వీడియో చూడగానే పోలీసులకు అనుమానం వచ్చింది. వీడియో అప్‌లోడ్ చేసిన సమయంలోనే అదే ప్రాంతంలో ఓ చోరీ జరిగింది. ఆ బాలుడే ఈ దొంగతనం చేశాడా అనే అనుమానం కలిగి, విచారణ చేశారు.

ఈ రీల్ వైరల్ అవ్వ డానికి ముందు రోజు కాన్పూర్ లో తరుణ్ శర్మ అనే జోతిష్యుడి ఇంట్లో చోరీ జరిగింది. అతడి ఇంట్లోని సీసీ కెమెరాల్లో చోరీ ఘటన మొత్తం రికార్డ్ అయింది. ఈ ఫుటేజీ చూసిన పోలీసులకు వారు చూసిన ఇన్‌స్టా వైరల్ వీడియో గుర్తొచ్చింది. చోరీ చేసిన వ్యక్తి తర్వాత హోటల్‌కి వెళ్లి వీడియో చేసి ఉండొచ్చని భావించారు. చివరకు డిజిటల్ ట్రాకంగ్ సిస్టమ్ ద్వారా దొంగను పట్టుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రూ.2లక్షల నగదు, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలుడు కావడం గమనార్హం. పోలీసుల ద్వారా ఈ చోరీ విషయం తెలిసి, ఆ వైరల్ వీడియో పట్ల నెటిజన్లు కూడా షాకౌతున్నారు.