Lalu Prasad Yadav: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ట్రాప్ లో తాను కూడా పడ్డానని సరదాగా అన్నారు. అందరి లాగే తాను కూడా 15 లక్షల అత్యాశతో కుటుంబంలోని అందరి సభ్యులపై ఖాతాలు తెరిపించానని, కానీ మోసపోయానని లాలూ యాదవ్ సెటైర్ వేశారు.
Lalu Prasad Yadav: 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన ప్రతిపక్ష కూటమి(ఇండియా) సమావేశంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ అత్యంత ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను కూడా బీజేపీ బ్లఫ్లో చిక్కుకున్నానని అన్నారు.
2014 ఎన్నికలను ప్రస్తావిస్తూ.. బీజేపీ అబద్ధాలు చెప్పి, పుకార్లు పుట్టించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. దేశంలోని చాలా మంది నేతల డబ్బు( బ్లాక్ మనీ) స్విస్ బ్యాంకుల్లో ఉందని, తనతోపాటు మరి కొందరు నేతల పేరుతో స్విస్ బ్యాంకుల్లో కోట్లలో డబ్బులు ఉన్నాయని బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చి దేశ ప్రజల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని నరేంద్ర మోదీ అప్పట్లో చెప్పారని, ఈ తరుణంలో చాలా బ్యాంక్ ఖాతాలను తెరిచారని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ ఆఫర్కు తాను కూడా ఆకర్షితుడినయ్యానని. దాని కోసం తన కుటుంబ సభ్యులందరీ పేర్ల మీద బ్యాంకు ఖాతా కూడా తెరిచినట్లు చెప్పారు. పశుపోషణలో తాను ఎలాంటి అవినీతి చేయలేదని, నరేంద్ర మోదీ అవినీతి చేస్తున్నారని అన్నారు. అందరి ఖాతా తెరిచి ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
అబద్ధాలు, పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉందన్నారు. టమోటాల ధరలు ఎలా ఉన్నాయో ఇక చెప్పావల్సిన అవసరం లేదనీ, బెండకాయ కూడా కిలో 60 రూపాయలకు చేరుకుందని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వంలో దేశంలోని మైనారిటీలకు భద్రత లేదని, నిత్యం ఏదోక చోట అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. గత లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకం కాకపోవడంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందనీ.. ఇన్ని రోజులు దేశ ప్రజలు అణిచివేతకు గురయ్యారని విమర్శించారు.