Lalu Prasad Yadav slams BJP: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశం అంతర్యుద్ధం వైపు వెళుతోందని అన్నారు.
Lalu Prasad Yadav slams BJP: బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంపూర్ణ క్రాంతి దివస్ సందర్భంగా లాలూ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ పని తీరుతో దేశం అంతర్యుద్ధం దిశగా పయనిస్తోందన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా బీహార్, దేశ ప్రజలు ఏకం కావాలని లాలూ పిలుపునిచ్చారు. దుష్పరిపాలనపై ఐక్యంగా పోరాడాలని, అప్పుడే గెలుస్తామని లాలూ ప్రసాద్ అన్నారు. అనారోగ్యం కారణంగా, లాలూ యాదవ్ కార్యక్రమానికి హాజరు కాలేదు, కానీ సోషల్ మీడియా ద్వారా కేంద్రం, బీహార్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని తన సందేశంలో పేర్కొన్నారు. దేశంలో లౌకిక శక్తులు ఏకమై కలిసి పోరాడాలని కూడా లాలూ విజ్ఞప్తి చేశారు.సోషలిస్టు అయిన నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం నాగ్పూర్ ఎజెండా ప్రకారం నడుస్తోందని యాదవ్ అన్నారు. తనకు వ్యతిరేకంగా అన్ని దర్యాప్తు సంస్థలను వినియోగించి నప్పటికీ భయపడనని లాలూ ప్రసాద్ చెప్పారు.
మరోవైపు.. బీహార్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని కొందరు అంటున్నారని ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. కానీ ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాదనీ, ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వమనీ, బీహార్లో నేడు ఎవరూ సంతోషంగా లేరని ఆర్జేడీ నేత తేజస్వి అన్నారు. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందనీ, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని విమర్శించారు. కూలీలు, నిరుద్యోగం గురించి ఎవరూ మాట్లాడరనీ. దీంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇతరత్రా అంశాలు లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ నిరుద్యోగానికి కేంద్రబిందువుగా మిగిలిపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ ఎలాంటి పనులు జరగడం లేదని, అవి సమాజంలో విషాన్ని విత్తుతున్నాయని తేజస్వి అన్నారు.
జూన్ 5, 1974న లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో పాట్నాలోని గాంధీ మైదాన్లో ఒక చారిత్రాత్మకమైన సమావేశం జరిగింది. అదే సభ జ్ఞాపకార్థం.. ప్రతి సంవత్సరం సంపూర్ణ క్రాంతి దివస్ గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఆర్జేడీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించి బీహార్ ప్రభుత్వ రిపోర్ట్ కార్డును విడుదల చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థులను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
లాలూ యాదవ్పై తాజా కేసు
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ పై కొత్త కేసు నమోదైంది. 2004-2009 మధ్య రైల్వే మంత్రులుగా ఉన్న సమయంలో లాలూ యాదవ్, రబ్రీ దేవి, ఇతర కుటుంబ సభ్యులు తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భూములు తీసుకున్నారని ఈ కేసులో సీబీఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, బీహార్ సహా దేశవ్యాప్తంగా 15కి పైగా చోట్ల దాడులు నిర్వహించారు.ముఖ్యంగా, లాలూ యాదవ్ ఇటీవలే పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన ఐదు కేసులలో చివరిగా బెయిల్ పొందారు, ఇందులో అతను సగం జైలు శిక్ష అనుభవించాడు.