Lake water turns pink: గుజరాత్లోని ఓ సరస్సు నీరంతా గులాబీ రంగులోకి మారింది. దీనిని చూసిన గ్రామస్తులు ఇది ఒక అద్భుతం అని పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం ఈ నీటిని ఏ అవసరాలకు కూడా ఉపయోగించకూడదని చెప్పారు.
Lake water turns pink in Gujarat: సాధారణంగా నీళ్లలో ఏ రంగు కలిపే అవి ఆ రంగులోకి మారడం సహజం. కానీ అక్కడ ఏ రంగు కలపకుండానే నీరు గులాబీ రంగులోకి మారింది. ఒకటి రెండు లీటర్లు కాదు ఏకంగా ఒక సరస్సు మొత్తం గులాబీ రంగులోకి మారింది. దీనిని చూసిన గ్రామస్తులు ఇది ఒక అద్భుతం అని పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం ఈ నీటిని ఏ అవసరాలకు కూడా ఉపయోగించకూడదని చెప్పారు. అసలు ఏం జరిగింది. ఉన్నట్టుండి సరస్సు మొత్తం ఎందుకు గులాబీ రంగులోకి మారింది? ఇలా జరగడం దేనికి సంకేతం? గుజరాత్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్లోని బనాస్ కంఠ జిల్లా సుయిగామ్ గ్రామ సమీపంలోని సరస్సు ఇప్పుడు గులాబీ రంగులోకి మారడంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అనూహ్యంగా ఈ చిన్న సరస్సులోని నీరంతా గులాబీ రంగులోకి మారడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు దీనిని మిరాకిల్ గా పేర్కొంటున్నారు. అలాగే, భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ కొరేటి చెరువు నీరు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారడంతో గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. ఈ వార్త తెలియడంతో చెరువు నీటిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ చెరువులో వర్షపు నీరు ఉండడంతో గ్రామ ప్రజలు ఏడాది పొడవునా వినియోగిస్తారు. సమీపంలోని మహాదేవుని ఆలయం ఉండటంతో.. ఇది ఒక అద్భుతం అని గ్రామస్తులు నమ్ముతున్నారు.
కాగా, స్థానిక యంత్రాంగం విచారణ కోసం స్థలానికి చేరుకుంది. పరీక్ష కోసం నీటి నమూనాను ల్యాబ్కు పంపింది. తహసీల్ డెవలప్మెంట్ ఆఫీసర్ KA భాటియా ప్రకారం.. "నీరు గులాబీ రంగులోకి మారడం గురించి మాకు సమాచారం వచ్చినప్పుడు, మేము వెంటనే దర్యాప్తు కోసం ఇక్కడ ఒక బృందాన్ని పంపాము. నీటి నమూనా తీసుకోబడింది. దీనితో పాటు, ప్రస్తుతం ఈ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని ప్రజలకు తెలియజేయబడింద"న్నారు. "గ్రామస్తులు ఇది ఒక అద్భుతం అని నమ్ముతారు, కాని నిపుణులు గ్రామ చెరువులోకి గట్టర్ నీరు ప్రవేశించారని, ఇది రసాయన ప్రతిచర్యకు కారణమైందని మరియు నీరు గులాబీ రంగులోకి మారిందని" అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా, చెన్నైలోనూ ఇలాంటి ఘటన గతవారంలో వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని పల్లికరనై మార్ష్ల్యాండ్ ప్రాంతంలో ఒకప్పుడు మార్ష్ల్యాండ్గా ఉన్న సరస్సు ఇప్పుడు గులాబీ రంగులోకి మారడంతో పర్యావరణ ప్రేమికులు మరియు నివాసితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్ష్ల్యాండ్లోని కొంత భాగాన్ని చాలా సంవత్సరాల క్రితం చెత్త ల్యాండ్ఫిల్గా మార్చారు. బయో, మెడికల్, కెమికల్స్తో సహా అన్ని వ్యర్థాలను ఒకే భూమిలో పడవేయడం వల్ల మీథేన్ ఉత్పత్తికి దారితీసింది, దీని ఫలితంగా ఇటీవల డంప్ యార్డులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆల్గే వికసించడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. సరస్సులో సైనోబాక్టీరియా పెరగడం వల్ల రంగు మారిందని వారు భావిస్తున్నారు.
తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ సిబ్బంది అధికారులు సరస్సు నుండి నమూనాలను సేకరించారు. ఆక్సిజన్-తక్కువ వాతావరణం మరియు మీథేన్ స్రవించడం వల్ల కుళ్ళిపోవడం సైనోబాక్టీరియా వంటి జాతులకు తగిన వాతావరణాన్ని సృష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు.