2023లో అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన: కుమారస్వామి సంచలనం
జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2023లో జరగాల్సిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే ఆయన అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఈ నెల 27న 140 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేస్తామని కుమారస్వామి చెప్పారు.
జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2023లో జరగాల్సిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే ఆయన అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఈ నెల 27న 140 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేస్తామని కుమారస్వామి చెప్పారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశామని... 27న పార్టీ నేతలతో జరిగే సమావేశంలో వారిలో ఒకరిని ఖరారు చేసి, అభ్యర్థిగా ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇక పార్టీలో కొనసాగాలని ఎవరినీ ప్రాధేయపడే ప్రసక్తే లేదని కుమారస్వామి తేల్చిచెప్పారు. జేడీఎస్లో ఉండేవారు ఉండొచ్చని, వెళ్లిపోయేవారు పోవచ్చని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని కుమారస్వామి వెల్లడించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
జేడీఎస్ను కొందరు తక్కువగా అంచనా వేస్తున్నారని... 2023 ఎన్నికల ఫలితాల తర్వాత వీరందరూ పశ్చాత్తాప పడతారని కుమారస్వామి జోస్యం చెప్పారు. ఇదే సమయంలో బీజేపీతో జేడీఎస్ కుమ్మక్కయిందనే వార్తలను ఆయన ఖండించారు. పార్టీ అధినేత దేవెగౌడకు వయసు పైబడినా... ఆయనలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు.