శబరిమల : అయ్యప్ప ప్రసాదం ‘‘అరవణం’’ విక్రయాలపై నిషేధం.. కారణమిదే
శబరిమల అయ్యప్ప ఆలయంలోని ప్రఖ్యాత అరవణం ప్రసాదం విక్రయాలపై కేరళ హైకోర్టు నిషేధం విధించింది. దీని తయారీకి ఉపయోగించే యాలకుల్లో రసాయన పదార్ధాలు వున్నందున ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
శబరిమల అనగానే వెంటనే గుర్తొచ్చేది అయ్యప్ప ఆలయం, ఆ తర్వాత అరవణం ప్రసాదం. బియ్యం, బెల్లం, నేతితో తయారు చేసే ఈ ప్రసాదం రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. శబరిమల వెళ్తున్న వారిని, వెళ్లి వచ్చిన వారిని ఖచ్చితంగా అరవణం ప్రసాదం అడుగుతారు. అలాంటి ఈ పవిత్ర ప్రసాదానికి సంబంధించి భక్తులకు షాకిచ్చింది కేరళ హైకోర్ట్. అరవణం ప్రసాద విక్రయాలు తక్షణం నిలిపివేయాలని ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డును న్యాయస్థానం ఆదేశించింది.
దీని తయారీకి ఉపయోగించే యాలకుల్లో రసాయన పదార్ధాలు వున్నాయని నిపుణులు ఇచ్చిన నివేదికలను పరిగణనలోనికి తీసుకున్న హైకోర్ట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో రసాయన పదార్థాలతో వున్న యాలకులు లేకుండా ప్రసాదం తయారు చేసి, దానిని విక్రయించుకోవచ్చని కోర్ట్ సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా వున్న పదార్ధాలతో తయారు చేసిన ప్రసాదాన్ని అమ్మకానికి అనుమతిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశించింది.
ఇకపోతే.. శబరిమలలో వున్న సురులీ జలపాతంలో భక్తులు స్నానం చేయడంపై కేరళ అటవీ శాఖ ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సురులీ వాటర్ ఫాల్స్ మంచి టూరిస్ట్ స్పాట్. తెనీ జిల్లా కంపం దగ్గర ఉన్న ఈ జలపాతానికి చాలా మంది పర్యాటకులు వస్తారు. ఇది ఒక గొప్ప స్పిరిచువల్ ప్లేస్ కూడా. దీనికితోడు శబరిమల సీజన్ కావడంతో సాధారణ పర్యాటకులతోపాటు అయ్యప్ప భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండనుంది. అందుకే ప్రజల ప్రాణ రక్షణ దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవలి కాలంలో తెనీ సందర్శిస్తున్న అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా తెనీ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇట్టమాడు, తూవానమ్ డ్యామ్ ఏరియా సహా సురులీ జలపాత పరివాహక ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా సురులీ జలపాతానికి నీరు ఎక్కువగా వస్తున్నది.అందుకే సురులీ జలపాతంలో నీటి ఉధృతి తగ్గే వరకు స్నానం చేయడానికి అవకాశం ఇవ్వబోమని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వెల్లడించారు.