బీజేపీ నుంచి రూ.10 కోట్లు తీసుకున్నారు: కుమారస్వామిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామిపై సంచలన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి కుమార స్వామి 10 కోట్ల రూపాయలను తీసుకున్నారని ఆయన ఆరోపించారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామిపై సంచలన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి కుమార స్వామి 10 కోట్ల రూపాయలను తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ 10 కోట్లు తీసుకున్న తర్వాతే జేడీఎస్ తన అభ్యర్థిని బరిలోకి దింపిందని జమీర్ అహ్మద్ అన్నారు. బీజేపీ దగ్గర పది కోట్లు తీసుకొని జేడీఎస్ ఎన్నికల్లో పోటీకి దిగుతోందని, ఓటు బ్యాంకును చీల్చేందుకే కుమార స్వామి కుట్రలు చేస్తున్నారని జమీర్ మండిపడ్డారు.
తమ వద్ద తగిన నగదు లేదని, అందుకే తమ అభ్యర్థిని రంగంలోకి దింపడం లేదని దేవెగౌడ అన్నారని చెప్పారు. అందుకే కుమార స్వామి బీజేపీ నుంచి డబ్బులు తీసుకొని అభ్యర్థిని దించుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ నుంచి మీరెందుకు డబ్బులు తీసుకున్నారు? కుమార స్వామి బీజేపీ ఏంజెంట్. నేను దేవెగౌడ గురించి మాట్లాడాలనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. దేవెగౌడ రాజకీయాలే వేరని.. కానీ కుమార స్వామి అలా చేయడం లేదు. ఆయన గురించి మాట్లాడడానికి సిగ్గేస్తోందంటూ జమీర్ అహ్మద్ విమర్శించారు.