సోనియా సేనగా మారేందుకు శివసేన రెడీ: కంగనా తీవ్ర వ్యాఖ్యలు
శివసేనకు, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగతూనే ఉంది. తాజాగా కంగనా శివసేనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోనియా సేనగా మారేందుకు సిద్ధపడిందని ఆమె అన్నారు.
ముంబై: శివసేనపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటల యుద్ధాన్ని సాగిస్తూనే ఉంది. తాజాగా ఆమె శివసేనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం బాలససాహెబ్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి శివసేన సోనియా సేనగా మారేందుకు సిద్ధపడిందని ఆమె అన్నారు.
ముంబైలోని పాలీ హిల్ లో గల కొన్ని అక్రమ నిర్మాణాలను బృహణ్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కూల్చడంతో కంగనాకు, శివసేనకు మధ్య వివాదం ముదిరింది. కూల్చివేతల తర్వాత బీఎంసీ అధికారులపై కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఎంసీ అధికారులను గూండాలుగా అభివర్ణించారు.
బీఎంసీ అధికారులను గూండాలుగా అభివర్ణిస్తూ వారిని తాను నగర పాలక సంస్థ అధికారులుగా పిలువబోనని అన్నారు. శివసేనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ - మీ తండ్రి మంచి పనులు మీకు సంపదను ఇచ్చి ఉంటాయి, కానీ గౌరవం మాత్రం మీ అంతట మీరే సంపాదించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
మీరు ఎందరి నోళ్లు మూయిస్తారని ఆమె ప్రశ్నించారు. ఎన్ని గొంతుకలను అణిచివేస్తారని అడిగారు. వాస్తవాల నుంచి ఎన్ని రోజులు పారిపోతారని అడిగారు.