భారత్లో అందుబాటులోకి మరో టీకా... జాన్సన్ అండ్ జాన్సన్కు అనుమతి, దేశంలో ఐదుకు చేరిన వ్యాక్సిన్లు
భారత్లో జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన సింగిల్ డోస్ కరోనా టీకాకు అత్యవసర అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీంతో ఇండియాలో మొత్తం టీకాల సంఖ్య ఐదుకి చేరాయి.
భారత్లో మరో విదేశీ టీకా అందుబాటులోకి వచ్చింది. కొవిడ్-19కు సింగిల్ డోసు టీకా తీసుకొచ్చిన అమెరికా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్.. భారత్లో అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో భారత్లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరింది. కరోనాపై మనదేశం జరుపుతోన్న పోరాటానికి జాన్సన్ అండ్ జాన్సన్ తోడ్పాటునివ్వనుంది అని మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు.
కాగా, భారత్లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఆగస్టు 5న దరఖాస్తు చేసుకున్నట్లు నిన్న జాన్సన్ ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వంతో జరుపుతోన్న చర్చలు త్వరలోనే కొలిక్కి రావాలని కోరుకుంటున్నామన్నారు. ఆ మరుసటి రోజే జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఆమోదం లభించడం విశేషం.
Also Read:దేశంలో 38వేల కేసుల, 40వేల రికవరీలు.. 50 కోట్లు దాటిన వ్యాక్సినేషన్..
ప్రస్తుతం మనదేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు అందుబాటులో ఉండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు కూడా ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. మోడెర్నా టీకాలను దిగుమతి చేసుకునేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం స్పుత్నిక్ ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. ఈ జాబితాలోకి ఇప్పుడు జాన్సన్ టీకా చేరింది. భారత్లో అందుబాటులో వున్నవన్నీ రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ మాత్రం సింగిల్ డోసు టీకా కావడం గమనార్హం.