జమ్మూకశ్మీర్ : రెచ్చిపోయిన ఉగ్రవాదులు .. అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ హత్య
జమ్మూకశ్మీర్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ను ఉగ్రవాదులు హతమార్చారు. కుల్గాం జిల్లా దేవ్ సర్ లోని హసన్ లోన్ నివాసం దగ్గర ఈ ఘటన జరిగింది. హసన్ లోన్ 4 నెలల కిందటే అప్నీ పార్టీలో చేరారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భధ్రతా దళాలపై కాల్పులకు తెగబడటంతో పాటు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈసారి ఏకంగా ఓ రాజకీయ పార్టీ నాయకుడిని దారుణంగా హతమార్చారు. అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన చనిపోయారు. కుల్గాం జిల్లా దేవ్ సర్ లోని హసన్ లోన్ నివాసం దగ్గర ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం కొందరు సాయుధులైన టెర్రరిస్టులు ఆయన ఇంటి దగ్గర కాపు కాచి తుపాకులతో కాల్పులు జరిపారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.
హసన్ లోన్ 4 నెలల కిందటే అప్నీ పార్టీలో చేరారు. ఆయన గతంలో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)లో కొనసాగారు. హసన్ లోన్ మృతిపై మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సంతాపం తెలిపారు.