సారాంశం

భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు కైజర్ ఫరూఖ్‌ దారుణంగా హతమయ్యాడు. కరాచీ వీధిలో కొందరితో కలిసి నడుచుకుంటూ వెళ్లుతుండగా వెనుక నుంచి ఆయనపై కాల్పులు జరిగాయి. నేలపై పడిపోయిన కైజర్ ఫరూఖ్ ప్రాణాలు వదిలాడు. లష్కర్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపక సభ్యుడైన ఫరూఖ్.. 26/11 ముంబయి పేలుళ్లకు సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు.
 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్ అవుతున్నది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు కైజర్ ఫరూఖ్‌ హత్యకు సంబంధించిన వీడియోగా వైరల్ అవుతున్నది. లష్కర్ ఇ తాయిబా టెర్రరిస్టు గ్రూప్ వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి పేలుళ్ల కుట్ర కేసు ప్రధాన నిందితుడైన హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు కైజర్ ఫరూఖ్ హతమైనట్టు తెలుస్తున్నది. పాకిస్తాన్‌లోని కరాచీ వీధుల్లో కొందరితో కలిసి నడుస్తుండగా గుర్తు తెలియని ఇంకొందరు ఆయనను గురి చూసి షూట్ చేసినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తున్నది.

కాల్పుల శబ్దాలు వినిపించగానే అందరూ మూకుమ్మడిగా పరుగు పెట్టారు. అయితే.. వెనుక నుంచి బుల్లెట్ దిగిన కైజర్ ఫరూక్ కొన్ని అడుగులు వేయగానే కిందపడిపోయాడు. ఆ కిందపడిపోయిన వ్యక్తి కైజర్ ఫరూఖ్ అని భావిస్తున్నారు. పాకిస్తాన్ పత్రిక డాన్ కూడా కింద పడిపోయిన వ్యక్తిని కైజర్ ఫరూఖ్‌గా రిపోర్ట్ చేసింది. అయితే.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అయిన కైజర్ ఫరూఖ్ ఆయనేనా అనేది ఇంకా ధ్రువీకరించాల్సి ఉన్నది.

Also Read: టిడిపితో పొత్తు తర్వాత పవన్ ఫస్ట్ వారాహి యాత్ర... నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

కైజర్ ఫరూఖ్‌ను టార్గెట్ చేసుకునే షూట్ చేసినట్టుగా పాకిస్తాన్ అధికారులు భావిస్తున్నారు. అక్కడ దోపిడీ వంటిదేమీ జరగలేదని, ఉద్దేశపూర్వకంగానే కైజర్ ఫరూఖ్‌ను హతమార్చినట్టు చెబుతున్నారు. 30 ఏళ్ల కైజర్ ఫరూఖ్ గాయాలతో మరణించినట్టు వివరించారు.

26/11 ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు కైజర్ ఫరూఖ్‌ అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. హఫీజ్ సయీద్ కొడుకు కూడా ఇటీవలే అపహరణకు గురయ్యాడు. ఆయన ఆచూకీ ఇంకా లభించలేదు. సెప్టెంబర్ 26 వ తేదీ నుంచి హఫీజ్ సయీద్ కొడుకు కమలుద్దీన్ సయీద్ ఆచూకీ లేదు. కొందరు కారులో వచ్చి పేషావర్‌ నుంచి కమలుద్దీన్ సయీద్‌ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు సమాచారం.