ఇండియాలో కరోనా కేసులు అంతకు ముందు రోజుతో పోలిస్తే తక్కువగా నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 18,795 కరోనా కేసులు రికార్డయ్యాయి. 20 వేలకు దిగువన నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఊపిరి పీల్చుకొంటున్నారు.

న్యూఢిల్లీ:ఇండియాలో (india) గత 24 గంటల్లో 18,795 కరోనా కేసులు (corona cases)నమోదయ్యాయి. కరోనాతో దేశంలో 179 మంది మరణించారు.కరోనా కేసులు 20 వేలకు దిగువన నమోదు కావడం ఊరటనిస్తోంది. ఈ ఏడాది మార్చి తర్వాత ఇంత తక్కువస్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లో 13,21,780 మందికి కరోనా నిర్ఱారణ పరీక్షలు నిర్వహిస్తే 18, 795 కరోనా కేసులు రికార్డయ్యాయి.కరోనాతో దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,47,373గా నమోదైంది.కొత్తగా నమోదౌతున్న కేసుల కంటే కరోనా రోగుల రికవరీ అధికంగా ఉంది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 26,030 మంది కోలుకొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా నుండి కోలుకొన్న రోగుల సంఖ్య 3,29,58,002కి చేరుకొంది.

93 రోజులుగా 50 వేల కంటే తక్కువ కేసులు నమోదౌతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో కేరళ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళ రాష్ట్రంలో అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయి. నిన్న ఒక్కరోజే 11,699 కరోనా కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 58 మంది మరణించారు.