పంజాబ్‌లో ఓ ఐఏఎస్ కొడుకు విజిలెన్స్ అధికారులు ఇంటిలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఏఎస్ అధికారి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడు. ఇంటిలో సెర్చ్ చేయడానికి ఆయనను ఇంటికి తీసుకువచ్చారు. అదే సమయంలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఐఏఎస్ కొడుకు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. కాగా, విజిలెన్స్ అధికారులే హత్యచేశారని తల్లి ఆరోపించారు. 

చండీగడ్: అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన ఐఏఎస్ సంజయ్ పోప్లి కొడుకు కార్తిక్ పోప్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో సెర్చ్ చేయడానికి ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్లిని విజిలెన్స్ అధికారులు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత.. అదే ఇంటిలో విజిలెన్స్‌లో ఉండగానే కార్తిక్ పోప్లి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్లి భార్య మాత్రం.. విజిలెన్స్ అధికారులే తన కొడుకును బలి తీసుకున్నారని, తుపాకీతో కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఘటన పంజాబ్‌లోని సెక్టార్ 11లో శనివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల ప్రాంతంలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం, కార్తిక్ పోప్లి లా గ్రాడ్యుయేట్. తమ ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, కార్తిక్ కుటుంబ సభ్యులు మాత్రం రాష్ట్ర విజిలెన్స్ అధికారులే కార్తిక్‌ను చంపేశారని ఆరోపించారు. తమ ప్రాథమిక విచారణలో కార్తిక్ ఆత్మహత్య చేసుకున్నట్టుగానే తెలుస్తున్నదని పోలీసులు తెలిపారు.

ఐఏఎస్ సంజయ్ పోప్లిని ఆ ఇంటిని తీసుకెళ్లారని, మొహలీలోని విజిలెన్స్ కోర్టులో హాజరు పరిచినట్టు పోలీసులు తెలిపారు. కార్తిక్ పోప్లిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆయన మరణించినట్టుగా డాక్టర్లు చెప్పారు.

పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ సంజయ్ పోప్లి జూన్ 20న అవినీతి కేసులో అరెస్టు అయ్యాడు. ఆయన నివాసంలో కార్ట్‌రిడ్జ్ కేచ్‌లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఆయనపై ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. 

ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్లి టెండర్ క్లియర్ చేయ డానికి అందులో ఒక శాతం లంచాన్ని డిమాండ్ చేస్తున్నాడని కాంట్రాక్టర్ సంజయ్ కుమార్ కరప్షన్ హెల్ప్‌లైన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. సంజయ్ పోప్లి లంచం డిమాండ్ చేసినట్టు ఓ వీడియోను కూడా చూపించాడు. సీవరేజ్ వర్క్స్‌కు సంబంధించి టెండర్ అలాట్ చేయడానికి రెండో దఫా ఇన్‌స్టాల్‌మెంట్ అందించాలని అడిగా డని ఆరోపించాడు.