తమిళనాడులో వరుస హత్యలు కలకలం రేపాయి. ఒకే రోజు ఓ మహిళ, మరో పురుషుడు ఒకే రీతిలో హతమయ్యారు. దుండగులు వారి ఇద్దరి తలలను నరికేసి దారుణంగా చంపేశారు. ఈ ఘటనలు దిండిగల్ జిల్లాలో ఈ నెల 22న జరిగాయి. 

చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో ఓ మహిళను, మరో పురుషుడిని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. ఇద్దరి తలలు నరికేసి(Behead) దారుణంగా హత్య చేశారు. తమిళనాడు దిండిగల్ జిల్లాలో ఈ నెల 22న ఈ దారుణం జరిగింది. ఒకే రోజు వేర్వేరు సమయాల్లో ఈ హత్య(Murder)లు జరిగాయి. ప్రస్తుతం ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రంలో ఓ దళిత నాయకుడి హత్య కేసులో 59ఏళ్ల నిర్మలా దేవీ నిందితురాలిగా ఉన్నారు. 2012 జనవరిలో ఈ ఘటనపై కేసు నమోదైంది. తాజాగా, ఆమెను కొందరు దుండగులు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో చంపేశారు. 22వ తేదీన ఉదయమే ఆమె ఇంటికి వెళ్లిన ఓ ముఠా ఆమె శిరచ్ఛేదనం చేశారు. అంతేకాదు, ఆమె నివసిస్తున్న ఇంటి ముందే తెగ్గోసిన ఆ తలను ఉంచారు.

అదే రోజు సాయంత్రం మరో హత్య ఇదే తరహాలో జరిగింది. 38 ఏళ్ల స్టీఫెన్ రాజ్‌ పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అనుమంతరాయన్ కొట్టాయ్ బస్ స్టాప్ దగ్గర కొందరు అడ్డగించారు. బైక్ వస్తున్న స్టీఫెన్ రాజ్‌ను అటకాయించారు. ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. అనంతరం నిర్మలా దేవీని హతమార్చినట్టే స్టీఫెన్ రాజ్‌ను చంపేశారు. స్టీఫెన్ రాజ్ తలను నరికేసి మర్డర్ చేశారు. ఆయన శిరస్సును అదే ఏరియాలో వదిలిపెట్టి పోయింది ఆ ముఠా.

ఈ రెండు హత్యలు ఒకే రీతిలో ఉండటంతో రెండు దారుణాలకు పాల్పడినవారు ఒకే ముఠా సభ్యులా? అనే లింక్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు హత్యలకు సంబంధాలున్నాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలు తమిళనాట సంచలనం రేపాయి. దిండిగల్ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.