Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐఐటీ గ్రాడ్యుయేట్ పిటిషన్.. రూ. 50వేల ఫైన్ వేసిన సుప్రీంకోర్టు

కశ్మీర్ సమస్యకు సరైన పరిష్కారం ముషారఫ్, మన్మోహన్ సింగ్ ఒప్పందమే ఇవ్వగలదని ఐఐటీ బాంబే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు సమయం వృథా చేశారని పిటిషనర్‌పై రూ. 50 వేల జరిమానాను ద్విసభ్య ధర్మాసనం విధించింది.

iit bombay graduate file petion on solution for kashmir.. court slaps 50000 fine
Author
First Published Sep 9, 2022, 11:40 PM IST

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య రావణకాష్టంలా ఎప్పుడూ మండుతున్న సమస్య కశ్మీర్. జమ్ము కశ్మీర్ కోసం ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. అంతేకాదు, సరిహద్దు గుండా తరుచూ నిబంధనలు అతిక్రమిస్తూ కాల్పులు జరపడం.. భారత జవాన్లు మరణించిన ఘటనలు నిన్న మొన్నటి వరకు చూశాం. అలాంటి సమస్యకు సొల్యూషన్‌ను సూచిస్తూ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా లేదని, ప్రచార ప్రయోజన వ్యాజ్యంలా ఉన్నదని సుప్రీంకోర్టు మండిపడింది. రూ. 50వేల ఫైన్ వేసింది. 

ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ప్రభాకర్ వెంకటేశ్ దేశ్‌పాండే సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌లు రూపొందించిన ఫార్ములాను ప్రస్తావించారు. అటానమీ, జాయింట్ కంట్రోల్, డీమిలిటరైజేషన్ వంటి అంశాలు ఆ ఫార్ములాలో ఉన్నాయి. వీటిని మరింత చర్చించి విజయవంతంగా సమస్యను పరిష్కరించవచ్చనే అభిప్రాయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఫార్ములాను ఎంచుకుని కశ్మీర్ సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు వెలువరించాలని సుప్రీంకోర్టును కోరాడు.

ఈ పిటిషన్ న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లీ ధర్మాసనం ముందుకు వచ్చింది. విధాన పరమైన విభాగంలోకి న్యాయస్థానం వెళ్లదని, ఈ పిటిషన్ కేవలం ప్రచారమే లక్ష్యంగా వేసినట్టు కనిపిస్తున్నదని బెంచ్ పేర్కొంది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేస్తున్న కౌన్సెల్‌ను నోటీసులో పెడుతున్నామని కోర్టు వివరించింది. ఈ పిటిషన్ వింటామని, కానీ, కౌన్సెల్‌ను నోటీసులో పెడుతున్నామని, ఆయనకు జరిమానా వేస్తామని ముందుగానే బెంచ్ వార్నింగ్ ఇచ్చింది.

పిటిషనర్ తరఫున అడ్వకేట్ అరూప్ బెనర్జీ వాదిస్తూ కశ్మీర్ విషయమై పాకిస్తాన్‌పై భారత్ రెండున్నర యుద్ధాలు చేసిందని అన్నారు. గడిచిన 70 ఏళ్లలో ఈ సమస్యకు ఇప్పటి వరకూ పరిష్కారం లభించలేదని వివరించారు.

ఈ విషయమై తమ పిటిషనర్‌ ఇన్‌స్టంట్‌గా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలు చేయాలని భావిస్తున్నాడని వివరించారు. ముషారఫ్, మన్మోహన్ సింగ్ అకార్డ్ కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఇస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. కొన్ని నిమిషాలు ఆయన వాదనలు విన్న ధర్మాసనం.. తాము ఈ పిటిషన్‌ను విచారించాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్‌పై రూ. 50వేల జరిమానాను విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios