Uddhav Thackeray: అధికారంలోకి రావాలనుకుంటే రండి.. ఎన్నికల్లో గెలువండి, అంతే కానీ దుర్మార్గాలకు పాల్పడొద్దని బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తాజాగా ఉద్ధవ్ బావమరిదిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడాన్ని తప్పుబట్టారు. తనను జైల్లో పెట్టాలనేదే బీజేపీ లక్ష్యమైతే పెట్టండంటూ సవాలు విసిరారు.
Uddhav Thackeray: మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బావమరిది శ్రీధర్ మాధవ్ పాటంకర్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం దాడులు నిర్వహించి.. దాదాపు రూ.6.45 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే.. థానేలోని నీలాంబర్ ప్రాజెక్ట్లో రెసిడెన్షియల్ యూనిట్లతో సహా రూ.6 కోట్లకు పైబడిన స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో ఉద్ధవ్ బావమరిది ఆస్తులు స్థంభింపజేయడం ద్వారా తమను లక్ష్యంగా చేసుకున్నారని భావించిన ఆయన మోడీ సర్కార్పై విరుచుకుపడ్డారు
"మీరు అధికారంలోకి రావాలంటే.. రండి. అంతే కానీ, అధికారంలోకి రావడం కోసం దుర్మార్గాలకు పాల్పడవద్దు. మా కుటుంబ సభ్యులను వేధించవద్దు. మేము మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు" అని ఉద్ధవ్ థాకరే అన్నారు. "మీ కుటుంబాలు తప్పు చేశాయని లేదా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలమని మేము చెప్పడం లేదు. మీరు అధికారంలోకి రావడానికి మమ్మల్ని జైలులో పెట్టాలనుకుంటే, నన్ను జైలులో పెట్టండి" అని ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ భార్య రేష్మా సోదరుడు అనిల్ పరభ్ సహా ఉద్ధవ్ కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరేలపై ఈడీ కొద్ది రోజులుగా దాడులు చేస్తోంది. వీరితో పాటు పార్టీలోని కీలక నేతలు, వారి సన్నిహితులపై ఈడీ దాడులు చేస్తోంది. అయితే ఇదంతా తమపై అక్కసుతో ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని.. మహారాష్ట్రలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేసినందుకు ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నారని శివసేన ఆరోపిస్తోంది.
ఉద్ధవ్ థాకరే బావమరిదిశ్రీధర్ మాధవ్ పాటంకర్ నిర్వహిస్తోన్న శ్రీ సాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్ లిమిటెడ్ని, పుష్పక్ బులియన్ అనే కంపెనీపై దర్యాప్తు చేసింది ఈడీ. మనీలాండరింగ్ కేసులో శ్రీ సాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్ లిమిటెడ్ ప్రమేయం ఉన్నట్టు తెలిపింది.
పరారీలో ఉన్న ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి గత నెల చివర్లో, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఏజెన్సీ ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. అతను ఏప్రిల్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటాడు. అతనికి ముందు, NCP నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ను నవంబర్లో ED అరెస్టు చేసింది. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సహా దాని నాయకులు మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడానికి బిజెపి దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని శివసేన సంజయ్ రౌత్ అన్నారు.