power project in Kinnaur: హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లోని జల విద్యుత్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని ఐటీబీపీ సిబ్బంది రక్షించారు.
Tidong Hydropower Project: హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లోని జల విద్యుత్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని ఐటీబీపీ సిబ్బంది రక్షించారు. వివరాల్లోకెళ్తే.. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో 100 మెగావాట్ల టిడాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కార్మికులు ప్రాజెక్టు సొరంగంలోకి వెళ్లడానికి సద్ధమయ్యారు. అయితే, ఉదయం 11 గంటల సమయంలో ప్రాజెక్ట్ సొరంగం లోపలికి వెళ్లే ట్రాలీ ఒక్కసారిగా జారి కిందకు పడిపోయింది.
ఆ సమయంలో సొరంగంలోకి వెళ్లడానికి సంబంధించి ఆ ట్రాలీలో ఐదుగురు కార్మికులు ఉన్నారు. ఒక్కసారిగా ప్రాజెక్ట్కు చెందిన 5 మంది కార్మికులు ప్రయాణిస్తున్న ట్రాలీ కిందకు పడిపోయింది. అది ట్రాక్ నుండి జారిపడి 45 నుండి 50 డిగ్రీల వాలును దాటి వందల అడుగుల లోతులో పడిపోయినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సొరంగం తవ్వకంలో రాళ్లు విరిగిపడటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని సమాచారం.
ఈ ఘటనకు గురించి సమాచారం అందుకున్న 50వ బెటాలియన్ ITBPకి చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ఇతర ఏజెన్సీలతో కలిసి రెస్క్యూ పనిని ప్రారంభించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు కార్మికులను సొరంగం నుంచి బయటకు సురక్షితంగా తీసుకువచ్చారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్మికులను కూడా ITBP సిబ్బంది సొరంగం నుండి బయటకు తీసుకు వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్మికులు హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఉదయం నుంచి 2 30 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ పవర్ ప్రాజెక్ట్ రెటాఖాన్ సమీపంలో టిడాంగ్ అనే సట్లేజ్ నది ఉపనది వద్ద నిర్మితమవుతోంది.
ఈ దుర్ఘటనలో గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళకరంగానే ఉందని సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ సాది తెలిపారు. గాయపడ్డ కార్మికులను సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, ఇదిలావుండగా, శనివారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్లో కూడా ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఇండోర్లోని స్వర్న్ బాగ్ కాలనీలో రెండంతస్తుల భవనంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. భవనం బేస్మెంట్లో తెల్లవారుజామున 3.10 గంటలకు అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రధాన విద్యుత్ సరఫరా వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
