కర్నాటక రాష్ట్రంలోని మైనారిటీ వెల్ఫేర్ పరిదిలోని స్కూళ్లలో, మౌలానా అజాద్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో హిజాబ్, కాషాయ కండువాలు నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారమే దీనిని జారీ చేశామని తెలిపింది.
కర్నాటక (karnataka) రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ శాఖ (minority welfare department) ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కూళ్లలో, మౌలానా ఆజాద్ (maulana azad) మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో హిజాబ్ ను, కాషాయ కండువాలు నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లెవరూ హిజాబ్ లు, కాషాయ కండువాలు, ఇతర మతపరమైన జెండాలు ధరించకూడదని ఆదేశించింది.
మైనారిటీ వెల్ఫేర్, హజ్, వక్ఫ్ శాఖ కార్యదర్శి మేజర్ మణివణ్ణన్ పి (manivannan p) జారీ చేసిన ఈ సర్క్యులర్లో పలు అంశాలు ప్రస్తావించారు. కర్నాటక హైకోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎవరూ తమ మత విశ్వాసంతో సంబంధం లేకుండా హిజాబ్ గానీ, ఇతర కండువాలు వేసుకొని క్లాస్ లకు హాజరకావొద్దని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆ ఆదేశాల మేరకే కొత్త ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ‘‘ హై కోర్టు ఆదేశాలు మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, మౌలానా ఆజాద్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి హిజాబ్, కాషాయ కండువాలు నిషేధిస్తున్నాం ’’ అని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఉడిపి (udipi)లోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం గత నెలలో మొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. కాలేజీ యూనిఫామ్ నిబంధనలను అతిక్రమించి ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తున్నారని ఇంకొందరు విద్యార్థులు వాదనలకు దిగారు. క్రమంగా అది పెద్ద వివాదంగా మారింది. క్రమంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా మంటలు రాజేసింది. ఇది దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు విచారణ చేపడుతోంది. తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థుల ఎవరూ మత పరమైన దుస్తులు ధరించరాదని హైకోర్టు (high court) ఇటీవలే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వివాదంపై హై కోర్టు విచారణ జరపుతోంది. బుధవారం జరిగిన విచారణలో సందర్భంగా అడ్వకేట్ రవి వర్మ కుమార్ పిటిషనర్ల తరఫు వాదిస్తూ.. వేలాది మతాల గుర్తులను, సంకేతాలను, వారి మతాలను వ్యక్తపరిచే వాటినీ ధరించి రావడానికి అనుమతిస్తుండగా కేవలం హిజాబ్ను మాత్రమే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. దుపట్టాలు, గాజులు, టర్బన్లు, శిలువలను, బొట్టులను ధరించే వారిని ఎందుకు ప్రతి రోజు అనుమతిస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా.. హిజాబ్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) రాష్ట్ర శాసనసభకు బుధవారం తెలిపారు. ప్రీ యూనివర్సిటీ కాలేజీలకు డ్రెస్ కోడ్ వర్తిస్తుందని, డిగ్రీ కాలేజీలకు కాదని ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ (Ashwath Narayan) నిన్న ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై జీరో అవర్ సమయంలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ( Siddaramaiah) వివరణ కోరారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. మరోవైపు.. శివమొగ్గ జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు తొమ్మిది మందిపై సీఆర్ పీసీ సెక్షన్ 144 కింద కేసులు నమోదు చేశారు.
