హత్రాస్ కేసు: సిట్కు గడువు పెంపు.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ హత్యాచార కేసులో దర్యాప్తు నిమిత్తం ఏర్పటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) యూపీ ప్రభుత్వం మరో పది రోజుల గడువును పొడిగించింది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ హత్యాచార కేసులో దర్యాప్తు నిమిత్తం ఏర్పటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) యూపీ ప్రభుత్వం మరో పది రోజుల గడువును పొడిగించింది.
వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించి ‘సిట్’ బుధవారమే తన నివేదికను సమర్పించాల్సి ఉంది. అయితే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ బృందానికి మరో 10 రోజుల గడువును పెంచినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర హొంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కాగా ఈ కేసులో నిందితులు సహా బాధితురాలి కుటుంబసభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సిట్ బృందం భావిస్తోంది.
మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యం వ్యవహరించారని సిట్ సూచించడంతో హత్రాస్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్లను యోగి ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం బాధితురాలు మరణించింది.
అయితే అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు హడావుడిగా అంత్యక్రియలు జరిపించడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా అంత్యక్రియలు జరపడం పలు అనుమానాలకు తావిచ్చింది. కానీ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారమే అలా చేయాల్సి వచ్చిందని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.